శ్రీకృష్ణ నివేదికపై అనుమానాలు
శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సీమాంధ్ర నాయకులు విందు ఇవ్వాలని నిర్ణయించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. ఆ విందుకు వెళ్లకూడదని వారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు సూచించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తామని చెబుతున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చివరకు ఏ విధమైన కొలికి పెడతారో అనే అనుమానాలు తెలంగాణ అంతటా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు విషయంలో శ్రీకృష్ణ కమిటీ చేయబోయే సిఫార్సులపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. దానిపైనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ శక్తులు డిసెంబర్ తర్వాత ఆందోళన ఉధృతం చేయడానికి సమాయత్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీపై అనుమానాలు ఉండడం వల్లనే ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు బిజెపి, కాంగ్రెసు తెలంగాణ నాయకత్వం ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. శ్రీకృష్ణ కమిటీ తెంలగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా దాన్ని కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించుకోవడానికి కూడా ఆందోళన చేపట్టక తప్పదనే ఉద్దేశంతో తెలంగాణ శక్తులు ఉన్నాయి.