అధిష్టానం చేతిలో చిత్తయిన జగన్ నెక్ట్స స్టెప్?
అధిష్టానం తనంత తానే తనను బయటకు పంపాలని ఉద్దేశ్యంతోనే ఆయన సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా కథనాలు రాశారు. లేదా తనను అత్యున్నత పీఠం కూర్చుండ బెట్టాలనుకున్నారు. పార్టీ తనను బయటకు పంపిస్తే ప్రజల్లో సానుభూతి పొందవచ్చని భావిస్తున్నారు. అయితే ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అధిష్టానం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు ఆయన్ను బయటకు పంపించకుండా ఆయనంత ఆయనే బయటకు వెళ్లేలా తన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కిరణ్ ను తీసుకు వచ్చి కూర్చుండబెట్టింది. దీంతో అధిష్టానం ఎత్తులతో జగన్ చిత్తయ్యాడు.
అయితే ఇప్పుడు జగన్ తన అనుచరులను మంత్రివర్గంలోకి తీసుకుంటే కూల్ గా ఉంటాడా, కిరణ్ కు సహకరిస్తాడా అనేదే అందరి ముందున్న ప్రశ్న. జనవరిలో మిగిలి జిల్లాల్లో ఓదార్పు ప్రారంభిస్తున్నట్టు సమాచారం. సాక్షిలో ఇప్పటికే కిరణ్ ను వ్యతిరేకంగా కథనాలు ప్రసారమయ్యాయి. ఇటీవలి ఓదార్పులో రోశయ్యను లక్ష్యంగా చేసుకన్న జగన్ ఇప్పుడు కిరణ్ ను లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రోశయ్య తరువాత తనకు రావచ్చని అనుకున్న జగన్ ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. దీంతో ఆయన నెక్స్ట స్టెప్ అధిష్టానంపట్ల పరోక్షంగా మరింత ధిక్కార ధోరణి ప్రదర్శించి బయటకు వెళ్లడానికి ప్రయత్నాలే ఆయనకు మిగిలి ఉన్నాయి. ఆయన కూడా అదే చేయవచ్చు.
అయితే అధిష్టానం సైతం జగన్ అనుచరులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించి ఆయనకు దూరం చేయడమా, లేదా వారిని దూరం ఉంచడమా అనేది ఆలోచిస్తున్న విషయం. అయితే జగన్ అనుచరులను దూరంగా ఉంచడానికే ముఖ్యమంత్రి మార్పు అనే వాళ్లు కూడా ఉన్నారు. అధిష్టానానికి పూర్తిగా అనుకూలంగా ఉన్నవారినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారంటున్నారు. సాక్షిలో సోనియాకు వ్యతిరేకంగా వచ్చిన కథనాన్ని ఖండించిన పలువురికి మంత్రి పదవులు దక్కే అవకాశాన్ని కొట్టిపారేయేము. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందకు దాదాపు బెర్తు ఖరారు అయినట్టే భావిస్తున్నారు. వివేకానంద గతంలోనే సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నానని చెప్పారు.