జగన్ నుండి చిరుకు తొలి సవాల్!
జగన్ వర్గం రాజీనామాలు స్పీకర్ ఆమోదించి ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రచారంలో చిరుకే ప్రాధాన్యత, బాధ్యత ఎక్కువ. చిరంజీవి ఇమేజ్ తెలిసిన పార్టీ అధిష్టానం చిరును కడప ఉప ఎన్నికలతో పాటు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి పంపించింది. జగన్ వర్గం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే అధిష్టానం మరోసారి చిరుపై బాధ్యతలు మోపే అవకాశాలే ఎక్కువ. తాను పార్టీలో చేరటం వల్ల పార్టీకి ఎంత లాభం అని చిరంజీవి ఈ ఉప ఎన్నికల్లో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పిఆర్పీ నుండి గెలిచిన శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుండి గెలిచారు. ఉప ఎన్నికలు ఎదురైతే ఇక్కడ చిరు శోభా నాగిరెడ్డిని ఓడించి కాంగ్రెసు అభ్యర్థిని గెలిపించా తన బలం చాటాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే వైయస్సార్సీ పార్టీ నేతలు చిరంజీవి ఇమేజ్ పని చేయదంటున్నారు. కడప ఉప ఎన్నికల్లోనే చిరంజీవి సత్తా ఎంతో తెలిసిందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెసును మెజార్టీ స్థానాల్లో గెలిపించి పార్టీలో తన ప్రాధాన్యత ఎంతో నిరూపించుకోవాల్సిన బాధ్యత అందరికంటే చిరంజీవి పైనే ఎక్కువగా ఉంది. తద్వారా తన బలం చిరు నిరూపించుకునే అవకాశం ఉంది. కాంగ్రెసు భారీ ఓటమి చెందితే వైయస్సార్సీ పార్టీ నేతలు అంటున్నట్లుగా చిరంజీవి బలం తేలిపోయి అధిష్టానం వద్ద చిరు ప్రధాన్యత కాస్త పలుచనయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో చిరు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని బొత్స గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఉప ఎన్నికలు అవశ్యమయితే ఇప్పటికే ఓదార్పు యాత్రతో జనాల్లో నానుతున్న జగన్ను చిరంజీవి ఎదుర్కొని అధిష్టానం ఆశలు ఎంత వరకు సఫలం చేస్తారో చూడాలి.