తారుమారు: చిరుకు ఊరట, జగన్కు చిక్కులు
అంతకు ముందు కౌలు రైతుల సమస్యలపై, దానికి ముందు సమైక్యాంధ్రపై చిరంజీవి కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఏ సమస్య వచ్చినా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. మరో వైపు, ఇటు నాయకులు, అటు కార్యకర్తలు చేజారిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. పార్టీని పటిష్టపరచాల్సిన అనివార్యతలో చిక్కుకున్నారు. దీంతో ఆయనకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఒక రకంగా వాటితో చిరంజీవి విసిగిపోయారు. పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత రాజకీయాల్లో అతిథి పాత్ర పోషిస్తే సరిపోయే పరిస్థితి వచ్చింది.
వైయస్ జగన్ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ చెమటోడుస్తున్నారు. కడుపులో చల్ల కదలకుండా వ్యవహారాలను చక్కబెట్టుకునే స్థితి నుంచి ఎండనక, వాననక ఊళ్లు పట్టి తిరగాల్సి వస్తోంది. ప్రజా సమస్యలపైనే కాకుండా తన పార్టీని వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి రావడానికి జగన్ నిత్యం ప్రజల్లో ఉండాల్సి వస్తోంది. ఓదార్పు యాత్రను ఎడ తెగకుండా సాగించాల్సి వస్తోంది. మరో వైపు సాధ్యమైనంత ఎక్కువ మంది శాసనసభ్యులను కూడగట్టుకోవాల్సి వస్తోంది, ఉన్నవారు జారిపోకుండా చూసుకోవాల్సి వస్తోంది. వీటన్నింటికి తోడు సిబిఐ దర్యాప్తు పిడుగులా వచ్చి తల మీద పడింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల విమర్శలను, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది.