కాంగ్రెసుకు కలిసొస్తుంది

గతంలో సిఎం పర్యటించినప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, తెల్లం బాలరాజులు రాలేదు. కానీ రచ్చబండను మాత్రం అన్నీ తామై నిర్వహించారు. ఆళ్ల నాని అయితే సిఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ మధ్య అధికార కాంగ్రెసుకు అన్నీ కలిసి వస్తున్నాయి. తమ ప్రమేయం లేకుండానే వైయస్ జగన్, టిడిపి అధినేత చంద్రబాబుపై సిబిఐ విచారణకు తెరలేవడం, రాజీనామాల విషయంలోనూ పరిణామాలన్నీ తమకు సానుకూలంగా జరుగుతుండటం! ఇలా అన్నీ కాంగ్రెసుకు కలిసి వస్తున్నాయి. అటు తెలంగాణ, ఇటు జగన్ వర్గం ప్రజా ప్రతినిధుల రాజీనామాల విషయంలో శత్రు సంహారం జరుగుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారంటూ జగన్ వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించారు.
వాటిని ఆమోదింపచేసుకునేందుకు వారిలో అత్యధికులు సిద్ధంగా లేరని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. జగన్వర్గ ఎమ్మెల్యేలు పలువురు సిఎంతో కొన్ని రోజులుగా టచ్లో ఉంటున్నారు. దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు సిఎంను తరచూ కలుస్తున్నారని ఇకపై తాము అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని చెబుతున్నారని తెలుస్తోంది. అయితే వీరంతా పార్టీకోసం కూడా పనిచేయాల్సిందేనని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పట్టుబడుతున్నట్లు తెలిసింది. వారంతా సాంకేతికంగా మా ఎమ్మెల్యేలే. కలెక్టరేట్లలో కూర్చొని పనులు చేయించుకుంటే సరిపోదు! జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాలకు కూడా రావాల్సిందేనని బొత్స ఖచ్చితంగా చెబుతున్నారు.
కానీ కిరణ్ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతామని చెప్పడమంటే వారు జగన్కు దూరమయ్యామని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడమేనని పేర్కొంటున్నారట. అక్రమాస్తులు, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ వ్యవహారాలపై సిబిఐ పట్టు బిగించిన తర్వాతే జగన్ వర్గ ఎమ్మెల్యేల వైఖరిలో చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ వెంట బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శోభా నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన కృష్ణదాసు, కె.రామచంద్రారెడ్డి, కొండా సురేఖ వంటి కొద్ది మంది మాత్రమే ఉండే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. చాలామంది నేతలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించినప్పటికీ కొందరివి తిరస్కరణకు గురి కావడం, మరి కొందరివి పెండింగ్లో పడటం విశేషం.
రాజీనామాలు ఓకే చేయించుకోకుండా సర్దిచెప్పి, బుజ్జగించడంలో కాంగ్రెస్ విజయం సాధించడమే తిరస్కరణకు ముఖ్య కారణమని తెలుస్తోంది. దీంతో అధికార పక్షంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినా వీగిపోతుందని భావిస్తోంది. జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు మళ్లీ పార్టీలోకి వస్తున్నారన్న సమాచారం ఉందని బొత్స సత్యనారాయణ కూడా అంటున్నారు. ఎంపిల రాజీనామాలను తిరస్కరించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications