తెలంగాణతో కాంగ్రెసు పెద్దల బంతాట
కేంద్ర హోం మంత్రి మాత్రం తెలంగాణ సమస్యను రాష్ట్రంలోనే పరిష్కరించుకోవాలని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ఏకాభిప్రాయం లేదని, రాష్ట్రంలో పార్టీలు ఆ ఏకాభిప్రాయాన్ని సాధించాలని ఆయన అంటున్నారు. చిదంబరం పాటనే విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి తోడు కాంగ్రెసు పెద్దలు తెలంగాణతో ఆడుకోవడానికి కొత్తగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా దొరికింది. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వాలు అంగీకరిస్తే తప్ప తెలంగాణ సాధ్యం కాదని, రాష్ట్రంలోని మెజారిటీ శాసనసభ్యులు రాష్ట్ర విభజనకు అంగీకరించాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు అంటున్నారు.
తెలంగాణ అంశాన్ని పరిష్కరించే ఉద్దేశం గానీ, తెలంగాణకు వ్యతిరేకంగానో సానుకూలంగానో స్పష్టమైన వైఖరి ప్రకటించే సాహసం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ, ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెసు గానీ చేయడం లేదు. దీంతో తెలంగాణ అంశం రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. ఇది ఎన్నాళ్లు మండినా ఫరవాలేదని, తమ పార్టీ తామూ చక్కగా దేశాన్నీ రాష్ట్రాన్నీ ఏలితే చాలునని కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నారు. ప్రజలు ఎటు పోయినా ఫరవా లేదు, తాము అధికారంలో ఉంటే చాలుననే వైఖరిని అవలంబిస్తున్నారు.