వైయస్ జగన్ వెనక్కి తగ్గారా?
వైయస్ జగన్ వెంట నడిచే శాసనసభ్యుల సంఖ్య నానాటికీ తగ్గుతోందని అంటున్నారు. మంగళవారం పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా వైయస్ జగన్ను కలిసిన శాసనసభ్యులు 9 మంది మాత్రమే. జగన్కు మద్దతిస్తున్న శానససభ్యుల సంఖ్య 27 దాకా ఉంటుందని అంచనా వేసుకుంటూ వస్తున్నారు. కానీ మంగళవారం అంత తక్కువ మంది ఎందుకు వచ్చారనేది అర్థం కావడం లేదు. మిగతా వారు జిల్లాల్లో ఉన్నారా, హైదరాబాదులో ఉండి కూడా రాలేదా అనేదే ముఖ్యమైన ప్రశ్న. అయితే, కొంత మంది శాసనసభ్యులు మాత్రం వెనక్కి తగ్గారనేది నిజం.
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెసు శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మందిని చీల్చాల్సి ఉంటుంది. అంత మంది బలం జగన్కు లేదు. అందుకే ఆయన చంద్రబాబును రెచ్చగొడుతూ ఉన్నారు. ఒక వేళ చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్కు కనీసం 40 మంది శాసనసభ్యుల బలం అవసరం. అంత మందైనా వస్తారా అనేది అనుమానం. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం కూలకపోయినా తమకు నష్టం కలగకుండా చూసుకోవడానికే జగన్ వెనక్కి తగ్గుతున్నారు. అందుకే, చంద్రబాబు సవాల్ను స్వీకరించకుండా, అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీదేనని వాదిస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని జగన్ అనుకుంటున్నారు.