మాయా ప్రతిపాదన తెలంగాణకు దెబ్బ?
బిజెపి వ్యవహారాన్ని పక్కన పెడితే, యుపి విభజన ముందుకు రావడం వల్ల తెలంగాణపై రెండో ఎస్సార్సీని వేయాల్సిన అనివార్యతలో కేంద్ర ప్రభుత్వం పడుతుందని ఆంధ్రప్రదేశ్లోని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. మాయావతి ప్రతిపాదన తెలంగాణకు ఆటంకంగా మారుతుందని వారంటున్నారు. జాతీయ స్థాయిలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై, రాష్ట్రాల విభజనపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సి వస్తుందని, దాని వల్ల తెలంగాణపై కూడా ఆ జాతీయ స్థాయి వైఖరికి అనుగుణంగానే వ్యవహరించాల్సి వస్తుందని, జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రెండో ఎస్సార్సీని వేస్తుందని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఇప్పట్లో వీలు కాదని, రెండో ఎస్సార్సీ నిర్ణయం తర్వాత, దాని నివేదిక ఆధారంగానే తెలంగాణపై తమ వైఖరిని నిర్ణయించుకోవచ్చునని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు. ఈలోగా 2014 ఎన్నికలు వస్తాయని అంటున్నారు.
అయితే, తెలంగాణ వాదుల వాదన అందుకు భిన్నంగా ఉంది. యుపి విభజనపై మాయావతి నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తుందని వారంటున్నారు. మొత్తంగానే విభజన అనేది జాతీయ ఎజెండాగా ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ముందు పరిష్కరించాల్సి వస్తుందని వారంటున్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ అవసరం లేదని, భారత తొలి ప్రధాని నెహ్రూ మాటల ఆధారంగా తెలంగాణకు విడిపోవడానికి వీలుంటుందని వీరంటున్నారు. కలిసి జీవించడానికి వీలు కాదని భావించినప్పుడు తెలంగాణవాళ్లు విడిపోవచ్చునని నెహ్రూ అన్నారు. పైగా, తెలంగాణ రాష్ట్రం అనేది పునరుద్ధరణే తప్ప ఆంధ్రప్రదేశ్ విభజన కాదని తెలంగాణవాదులు అంటున్నారు.