రాజీనామాల తర్వాత జగన్ వర్గం ఉక్కిరి బిక్కిరి?
అంతేకాకుండా వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలినని చెప్పుకునే పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ, వైయస్ వల్లే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న సికింద్రాబాదు శాసనసభ్యురాలు జయసుధతో పాటు భద్రాచలం శాసనసభ్యురాలు కుంజా సత్యవతి తెలంగాణ పేరు చెప్పి రాజీనామాలు చేయక పోవడాన్ని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక శాసనమండలి సభ్యులను సైతం రాజీనామాలకు మినహాయించడం వారిలో అనుమానాలకు తావిస్తోన్నట్టు కనిపిస్తోంది. జగన్ వెంట వెళుతున్న ఇద్దరు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఒక ఎంపీ వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఎంపీలు ఇంతవరకు రాజీనామాలు చేయలేదని తెలుస్తోంది. వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో ఉండటానికి, రాజీనామాలకు సంబంధం ఏమిటని సదరు ఎంపీ ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.
దీనినంతా చూస్తుంటే జగన్ పక్కా వ్యూహంతోనే రాజీనామాలు చేయించినట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జగన్ ఆస్తులపై ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఏ సమయంలోనైనా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాను జైలుకు వెళితే తనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య తగ్గవచ్చన్న అనుమానంతో పక్కా వ్యూహంతోనే ఎమ్మెల్యేలను రాజీనామాల చట్రబంధంలో ఇరికించినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో స్పీకరు తమ రాజీనామాలు ఆమోదించి ఉప ఎన్నికలకు వెళితే మంత్రి టిజి వెంకటేష్ అన్నట్లుగా జగన్కు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య తగ్గే అవకాశాలూ కొట్టిపారేయలేమనే ఆవేదన వారిలో ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.