వివేకాతో చిక్కుల్లో కిరణ్ కుమార్ రెడ్డి

వివేకానంద రెడ్డిపై చర్య తీసుకోకపోతే డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఆత్మరక్షణలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కోణాన్ని సంఘటనకు అద్దారు. గవర్నర్ ప్రసంగం సందర్బంగా జరిగిన సంఘటనలకు బాధ్యులను చేస్తూ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులపై నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకున్నారు. ఆనాటి సంఘటనల కన్నా నేటి సంఘటన తీవ్రమైందనే విషయాన్ని సీమాంధ్ర నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. అందువల్ల నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారనే చెప్పాలి. నాదెండ్ల మనోహర్కు ఇందుకు సంబంధించిన సూచన చేయాల్సిన అవసరం కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఈ రకంగా కూడా ఇబ్బందుల్లో పడినట్లే. వివేకానంద రెడ్డిపై చర్యకు ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి విముఖత చూపినా నాదెండ్ల మనోహర్ చర్యలకు పూనుకోవచ్చు. అప్పుడు మరింతగా ముఖ్యమంత్రికి ఇబ్బందులు ఎదురవుతాయి.
ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న సీనియర్ మంత్రులు ఇప్పటికే శాసనసభలో జరిగిన సంఘటనకు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ దృష్ట్యా చూసినా మంత్రులు జరిగిన సంఘటనకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డిపై చర్యలు తీసుకుంటే పరిణామాలు ఎటు దారి తీస్తాయో కూడా చెప్పలేని స్థితి. వైయస్ వివేకానంద రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్ను దెబ్బ తీయడానికి రచించిన వ్యూహం అమలు బెడిసి కొట్టినా ఆశ్చర్యం లేదు. అదే గనుక జరిగితే ఇన్నాళ్లూ పడిన కష్టం వృధా అవుతుంది. వైయస్ జగన్ మరింతగా బలపడే అవకాశాలు లేకపోలేదు. ఇలా చూస్తే, కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది.












Click it and Unblock the Notifications