తెలంగాణ లొల్లి: రాష్ట్రపతి పాలన, మధ్యంతరం?
తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలను వెనక్కి తీసుకోకపోతే శాసనసభను రద్దు చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెసు శాసనసభ్యులకు అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చునని అన్నట్లు భావిస్తున్నారు. శాసనసభను రద్దు చేసి రాష్ట్రపాలన విధించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ తెలంగాణ నేతలను రెచ్చగొట్టే రీతిలోనే కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు, అధిష్టానం పెద్దలు మాట్లాడుతున్నారు. ఒక రకంగా హెచ్చరికలు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కాంగ్రెసు శాసనసభ్యులు రాజీనామాలను ఉపసంహరించుకునే పరిస్థితి లేదని అంటున్నారు. కొంత మంది వెనక్కి తగ్గినా చాలా మంది అందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ స్థితిలో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో మార్గం లేదనే భావన కాంగ్రెసు అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1వ తేదీలోగా తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల రాజీనామాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజాప్రతినిధులతో ఢిల్లీ చర్చలు విఫలమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్రమైన నిర్ణయమే రావచ్చునని అంటున్నారు.