జగన్ 'మాయాజాలం' వెనుక అతడే?
జగన్కు చెందిన కంపెనీల వ్యూహం, నిధల వరద, పెట్టుబడిదారుల మధ్య అనుసంధాన కర్త, డీల్సులో ముఖ్యపాత్ర, నిధులు మళ్లింపులంటూ వచ్చిన ఆరోపణలలో ఆయనదే ప్రముఖ పాత్ర అని తెలుస్తోంది. అందుకే సిబిఐ జగన్ ఆస్తుల కేసుల విషయంలో జగన్ తర్వాత అత్యంత ప్రాధాన్యమిస్తున్న వ్యక్తి విజయసాయి రెడ్డి అని తెలుస్తోంది. గురువారం ఉదయం నుండి రాత్రి పది గంటలు దాటే వరకు విజయసాయి రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ముడు దశల్లో సోదాలు నిర్వహించారు. సోదాలకు మొదట ముగ్గురే వచ్చినప్పటికీ తీవ్రత దృష్ట్యా మరో ఆరుగురు అధికారులు సోదాలలో పాల్గొన్నారు. జగన్ వ్యాపారాల విస్తరణకు సండూరు పవర్ ప్రాజెక్టు ఉపయోగపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో నిధుల వరద కోసం అల్లిన కంపెనీల అల్లిక వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారట.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, భూములు పొందిన పలువురు జగన్ కంపెనీలలో పెట్టుబడులు భారీగానే పెట్టారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులోనూ అతనిది కీలక పాత్ర ఉందట. విజయసాయి రెడ్డి చెన్నై కేంద్రంగా ఉన్న ఆడిటింగ్ సంస్థకు అధిపతిగా ఉండేవారంట. వైయస్ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్గా నామినేట్ అయ్యారట. ఆ తర్వాత సండూరు పవర్ ప్రాజెక్టులలో పెట్టుబడుల నేపథ్యంలో 2ఐ కాపిటల్ కంపెనీ విజయసాయి రెడ్డిని డైరెక్టర్గా నియమించిందని సమాచారం. ఆ తర్వాత నిధులు సండూరు నుండి కార్మెల్ ఏషియా అక్కడి నుండి ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్కు తరలినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజయసాయి రెడ్డి సండూరుకు రాజీనామా చేసి జగతిలో చేరి పోయారని తెలుస్తోంది.