ఓడి గెలిచిన యడ్యూరప్ప, గాలి సోదరులకు దెబ్బ
యడ్యూరప్పను దెబ్బ తీయడానికి బిజెపి జాతీయ నాయకుడు అనంతకుమార్, మంత్రులు గాలి సోదరులు తీవ్రంగా ప్రయత్నించారు. యడ్యూరప్ప వర్గానికి వ్యతిరేకంగా తమ వర్గాన్ని కూడగట్టారు. వీరంతా జగదీష్ షెట్టర్ను బలపరిచారు. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం, రాజీకి రావడానికి నిరాకరించడం వంటి పరిణామాల నేపథ్యంలో బిజెపి అధిష్టానం పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ రహస్య బ్యాలెట్ నిర్వహించారు. ఈ రహస్య బ్యాలెట్లో యడ్యూరప్ప బలపరిచిన సదానంద గౌడ ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభలో 120 మంది బిజెపి సభ్యులుండగా 118 మంది ఓటింగులో పాల్గొన్నారు.
కాగా, ఇరు వర్గాల మధ్య పోరు ఇంతటితో ముగిసేట్లు లేదు. మంత్రి వర్గ కూర్పు విషయంలో కూడా ఇరు వర్గాలు రాజకీయాలు నడిపే అవకాశం ఉంది. ఈ స్థితిలో స్వేచ్ఛగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం సదానంద గౌడకు ఉండకపోవచ్చు. పైగా, సదానంద గౌడ యడ్యూరప్ప అడుగుజాడల్లో నడవాల్సి ఉంటుంది. అయితే, అధికారం చేజిక్కిన తర్వాత పరిస్థితి ఏ విధంగా మారుతుందో చెప్పలేం.
అక్రమ మైనింగు కుంభకోణంలో లోకాయుక్త తప్పు పట్టడంతో ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి సోదరులను కూడా లోకాయుక్త తప్పు పట్టింది. వారిపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో గాలి సోదరులకు తిరిగి మంత్రి పదవులు దక్కుతాయా, లేదా అనేది అనుమానంగానే ఉంది.