సిబిఐ దర్యాప్తు: డీలా పడిన వైయస్ జగన్ వర్గం?
సిబిఐ విచారణ ఎటు దారి తీస్తుందనేది, జగన్ రాజకీయ భవిష్యత్తు ఏమమవుతుందనే అంతుపట్టడం లేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వైయస్ జగన్ భవిష్యత్తు సరే, తమ భవిష్యత్తు ఏమవుతుందనే కలవరానికి వారు గురవుతున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ప్రాథమిక విచారణకు వైయస్ జగన్ సహకరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తమ నాయకుడు విచారణకు సహకరిస్తున్నారని, నిజాయితీని నిరూపించుకునేందుకు సిద్ధపడ్డారని చెప్పుకోవడానికి వీలయ్యేదని అంటున్నారు.
సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో జగన్పై రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పుకోవడానికి తప్ప మరో రకంగా తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కాంగ్రెసు అధికారంలో కొనసాగడానికి ఇంకా మూడేళ్ల గడువు ఉంది. అంత సమయం ఉండగా ఇప్పటి నుంచే జగన్ వెంట నడుస్తూ తప్పు చేశామా అనే ఆలోచన కూడా వారిని తొలచి వేస్తోందని అంటున్నారు. ఈ నెల 26వ తేదీన సిబిఐ హైకోర్టుకు సమర్పించే నివేదికపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, వైయస్ జగన్ వర్గం ప్రజాప్రతినిధుల్లో కలవరం మొదలైందని అంటున్నారు. ఒకవేళ పూర్తి స్థాయి సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే మాత్రం తట్టుకోవడం కష్టమే అవుతుందని అనుకుంటున్నారు.