'చిద్దూ' చిచ్చు: రాహుల్కు షాక్, సోనియా కలవరం
ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఇక రాహుల్కు ఎలాంటి అడ్డంకులు ఉండవని అందరూ భావించారు. అయితే దాదా తర్వాత రాహుల్కు పోటీగా మరో కొత్త పేరు తెరపైకి వస్తోంది. అతడే చిదంబరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చిదంబరమే ప్రధాని అభ్యర్థి అంటూ కొంతకాలంగా ప్రచారం ప్రారంభమైంది. ఇది సోనియా గాంధీకి మింగుడు పడటం లేదు. కొంతమంది కాంగ్రెసు నేతలు కూడా చిద్దూకు మద్దతు పలుకుతున్నారట.
భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దింపితే చిదంబరం మాత్రమే ఆయనను ధీటుగా ఎదుర్కోగలరని కాంగ్రెసులోని ఓ వర్గం భావిస్తోందట. రాహుల్కు మోడీని ఎదుర్కొనే అనుభవం లేదని చెబుతున్నారట. కాంగ్రెసులో ఓ వైపు ఈ చర్చ సాగుతుండగానే లండన్ నుంచి వెలువడే అంతర్జాతీయ పత్రిక ది ఎకనమిస్ట్ కథనం పార్టీలో మరింత వేడిని రాజేసింది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాక ఆర్థిక మంత్రి చిదంబరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అవుతారని రాసింది. అప్పటికి ప్రస్తుత ప్రధాని మన్మోహన్ సింగ్కు 80 సంవత్సరాలు దాటుతాయని, అదే సమయంలో రాహుల్ గాంధీ ఇంకా ఎదగలేదని విశ్లేషించింది. చిదంబరం మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారని, ఆయన ఆ పదవికి అన్ని విధాలా సరిపోతారని రాసింది.
ఈ కథనం వెనక చిదంబరం హస్తం ఉండి ఉంటుందని కొందరు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. కాబోయే ప్రధానిగా విదేశీ మీడియా చిదంబరాన్ని తెర పైకి తీసుకురావడంపై సోనియాతో పాటు పలువురు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ కథనం వెనక ఎవరున్నారో కూపీలాగుతున్నారట. అయితే చిదంబరం ప్రభావం పడకుండా ఉండేందుకు పలువురు నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి రాహుల్కు అనుకూలంగా ప్రచారం కూడా ప్రారంభించారు.
సీనియర్ నేతలు చాకో, అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ షిండే వంటి నేతలు వచ్చే ఎన్నికల బాధ్యతలను రాహుల్ గాంధీయే పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. ప్రధాని పదవికి ఆయనే అర్హుడు అని చెబుతున్నారు. పలువురు ఎంపీలు చిదంబరం వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థి కావాలంటే కాంగ్రెస్లో ఉండాలో లేదో చిదంబరం ముందు తేల్చుకోవాలని మధ్యప్రదేశ్ ఎంపి సజ్జన్ సింగ్ వర్మ అన్నారు.