జగన్, జెడి ఇష్యూ: మహాకుట్ర వర్సెస్ మహాకుట్ర

విలేకరుల కాల్ లిస్ట్ పేరుతో జగన్ పార్టీ చేసింది మహా కుట్ర అని ఆరోపించింది. మహాత్ముడి సాక్షిగా జగన్ పార్టీ, ఆయన మీడియా కలిసి ఆడిన దుర్మార్గపు నాటకమని దుయ్యబట్టింది. న్యాయస్థానాలతో సహా అన్ని వ్యవస్థలకు ఉద్దేశాలు అంటగడుతూ, సర్వ వ్యవస్థలను భ్రష్టం చేస్తున్న జగన్ గ్యాంగ్.. చివరకు విలేకరులు నిర్వర్తించే విధులకూ కుట్ర సిద్ధాంతాలను ఆపాదించిందని మండిపడింది.
తన మీడియా, తనకు బాగా ఊదే మీడియా మినహా మిగిలిన వాళ్లంతా కుట్రదారులే అనే స్థాయికి తెగబడిందని పేర్కొంది. సమాచార సేకరణలో భాగంగా జెడి లక్ష్మీ నారాయణకు ఫోన్లు చేయడమంటే... జగన్కు వ్యతిరేకంగా కుట్ర పన్నడమే అనే నీచమైన సిద్ధాంతాన్ని సృష్టించిందని పేర్కొంది. జగన్ అరెస్టు వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు లైవ్లోనే ఉంచూతూ... తమకు గిట్టని మీడియాతోపాటు, సిబిఐని బ్లాక్ మెయిల్ చేసే వ్యూహం రచించారని పేర్కొంది.
సిబిఐ జెడి కాల్ లిస్టును సంపాదించి.. దాని ఆధారంగా ఆయనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారని, అంతటితో ఆగకుండా.. ఈ కుట్రలో ఒక వర్గం మీడియా కూడా భాగస్వామి అయినట్లు ఆరోపించారని మండిపడింది. విలేకర్ల పేర్లను, నెంబర్లను తమ టీవి చానెల్లో పదే పదే ప్రసారం చేసి.. ఏదో జరిగిపోతుందనే అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా రకరకాల విన్యాసాలు చేసిందని ఆరోపించింది. విలేకరుల విధి నిర్వహణే సమాచార సేకరణ అని.. అవసరమైతే కానిస్టేబుల్ స్థాయి నుండి డిజిపి స్థాయి వరకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం విలేకరుల విధి అని తెలిపింది.
కాగా ఓ వర్గం మీడియాతో సిబిఐ జెడి ఫోన్ సంభాషణలు జరుపుతున్నారని చెబుతూ ఎమ్మెల్యేలు గురువారం ఫోన్ నంబర్లతో సహా వివరాలు బయట పెట్టిన విషయం తెలిసిందే. జగన్కు భౌతిక హానీ చేసే కుట్రలో భాగమని వారు ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం, సిబిఐ కుట్రపూరితంగా కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జెడి సంభాషణలకు, కుట్రకు సంబంధముందని తాము నమ్ముతున్నామని వారు చెప్పారు.
దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలను అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు ముందుంచుతామని చెప్పారు. ఇతర పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు కూడా ఆధారాలు అందజేస్తామని చెప్పారు. ప్రాణహాని ఉంటుందని తెలిసి నార్కో పరీక్షలకు సిబిఐ పట్టుబడుతున్న తీరు అనుమానాలను పెంచుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications