చంద్రబాబు క్లియర్: కెసిఆర్కు ఎదురుదెబ్బ
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ రెండు వైఖరులను వినిపిస్తుందని కెసిఆర్ భావించారు. అయితే, అందుకు విరుద్ధంగా తెలంగాణకు అనుకూలంగా 2008లో ప్రణబ్ మఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ చెప్పడంతో కెసిఆర్ కంగుతిన్నారు. ఏమీ తేలదని, తూతూ మంత్రంగానే సాగుతుందని కెసిఆర్ అఖిల పక్ష భేటీని కెసిఆర్ తేలిగ్గా తీసుకున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
కాంగ్రెసు రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉందని హోం మంత్రి షిండే ప్రకటించడం, తెలుగుదేశం పార్టీ కచ్చితంగా నిర్ణయం చెప్పడం, నెల లోపల నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి చెప్పడంతో తెలంగాణ అంశం ముందుకు సాగినట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని కెసిఆర్ ఊహించలేదు. దీంతో అఖిల పక్ష భేటీ తర్వాత తెలుగుదేశం పార్టీపై, అఖిల పక్ష సమావేశంపై విరుచుకుపడ్డారు.
తెలంగాణకు తెలుగుదేశం పార్టీ సానుకూలమైన నిర్ణయం ప్రకటించడాన్ని తెలంగాణ జెఎసి భాగస్వామ్య పార్టీ బిజెపితో పాటు సీపీఐ, తెలంగాణ నగారా సమితి స్వాగతిం చాయి. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు సైతం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సైతం చంద్రబాబు ప్రకటనను స్వాగతించారు.
ఇంత మంది తమ పార్టీ వైఖరిని స్వాగతిస్తుంటే కెసిఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్కు సూచించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీల నాయకులను కెసిఆర్ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో అఖిల పక్ష సమావేశం పరిణామాలు కెసిఆర్ వ్యూహాన్ని దెబ్బ తీసినట్లేనని అంటున్నారు.