జానారెడ్డి తెలంగాణ పోరుకు సిఎం చెక్
ఇందులో భాగంగా జానా రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలతో మరోసారి భేటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు సిఎం మోకాలడ్డుతున్నారని అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశానికి వెళ్లకుండా సిఎం చేస్తున్నారట. దీంతో జానా సమావేశానికి వారు మొహం చాటేస్తున్నారని అంటున్నారు. వారు సమావేశానికి దూరంగా ఉండటంతో ఆయన జానా ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెలంగాణలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అదే సమయంలో జాతీయ స్థాయిలో తమ ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై ఖచ్చితమైన వైఖరితో ఉన్న బిజెపి మహబూబ్నగర్ నియోజకవర్గంలో గెలుపొందటం తెలంగాణ కాంగ్రెసు నేతలను పునరాలోచనలో పడేసింది. టిఆర్ఎస్ తెలంగాణ నినాదం కారణంగా గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల తెలంగాణ కోసం వరుస ఆత్మహత్యలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణపై అధిష్టానాన్ని ఎలాగైనా ఒప్పించాలని తెలంగాణ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఉప ఎన్నికల అనంతరం జానారెడ్డి, పార్లమెంటు సభ్యులు పలుమార్లు భేటీ అయి ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ వెళ్లే అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఓ తేదీ నిర్ణయించాలని భావించారు. వీరిని సమన్వయం చేసే పని మంత్రి జానా రెడ్డి చూస్తున్నారు.
ఇందు కోసం గత నెల మార్చి 25న జానా రెడ్డి ఇంట్లో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన తేది నిర్ణయం, అధిష్టానంపై ఎలా ఒత్తిడి తీసుకు రావాలో తదితర అంశాలపై జానా తాజాగా భేటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిఎం కారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.