రాజ్యసభ సీటు కోసం టిడిపిలో పరుగులు
ఉప ఎన్నికల్లో కడప లోక్సభ స్థానానికి తమ అభ్యర్థిగా మైసూరా రెడ్డిని తెలుగుదేశం పార్టీ పోటీకి దించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని ముందుగానే చెప్పారు. ఈ కారణం వల్ల ఈసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. మైసురా మాత్రం రాజ్యసభ సభ్యత్వానికే మొగ్గు చూపుతున్నారు. ఆయనకు అవకాశం రాని పక్షంలో రాజ్యసభ సభ సభ్యత్వాన్ని కోరుతున్న వారి సంఖ్య సీమాంద్రుల సంఖ్య గణనీయంగానే ఉంది. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆయన అందరికంటే ఓ అడుగు ముందున్నారు. కడప జిల్లాకే చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు, పారిశ్రామికవేత్త సీఎం రమేష్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కూడా రాజ్యసభపై కోరికతో ఉన్నా రెండేళ్ళలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఆయనకు అవకాశం రాకపోవచ్చని అంటున్నారు. అదే ప్రాంతం నుంచి ఈ సీటును ఆశిస్తున్నవారిలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దనరావు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, కృష్ణబాబు, లాల్జాన్బాషా తదితరులు ఉన్నారు.
తెలంగాణ ప్రాంతం నుంచి దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పుడు తమ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పనిచేసుకొంటున్నారు. వారి పేర్లు పరిగణనలోకి వస్తాయా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎనిమిదేళ్లుగా అధ్యక్షుడికి పార్టీ వ్యవహారాల్లో అండగా ఉంటూ వచ్చిన వరంగల్ జిల్లా నేత గరికపాటి మోహనరావు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, సంకినేని వెంకటేశ్వరరావు, వేం నరేంద్ర రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు కూడా తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు.