కలవరపాటు: ఉప ఎన్నికలపై కదిలిన హైకమాండ్

కనీసం సగానికి పైగా స్థానాలను గెల్చుకోవాలని భావిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో జగన్తో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు అందోళన చెందుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని సమగ్రంగా తెలుసుకొనేందుకు పార్టీ సీనియర్ నేత వయలార్ రవిని ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా లోగడ బాధ్యతలు నిర్వర్తించిన వయలార్ త్వరలో రాష్ట్రానికి వచ్చి ఐదు రోజుల పాటు మకాం వేసి పార్టీ పరిస్థితిపై ఆరా తీయనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలు అంత సానుకూలంగా లేవన్న వివిధ సర్వేల నివేదికలు అధిష్ఠానాన్ని కలవరానికి గురిచేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ను బలోపేతం చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల గురించి కూలంకషంగా తెలుసుకునేందుకు హైదరాబాద్కు వయలార్ను అధిష్ఠానం పంపుతోందని సీనియర్ కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.
రాష్ట్ర పర్యటనలో వయలార్ తనదైన శైలిలో సమగ్ర అధ్యయనం చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా గులాం నబీ ఆజాద్ ఉండగా మరో సీనియర్ నేతను ప్రత్యేకంగా రాష్ట్రానికి అధ్యయనం కోసం హైకమాండ్ పంపుతోందన్న సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి వయలార్ రాకను తేలిగ్గా తీసుకోలేమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో జరగనున్న 18 శాసనసభ, నెల్లూరు లోక్సభ ఉప ఎన్నికల సమరంలో పార్టీ స్థితిగతులపై సమాచారం సేకరించి అధిష్ఠానానికి ఒక నోట్ను వయలార్ పంపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలతో వయలార్ సమావేశమై వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటారని చెబుతున్నారు. అయితే పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డియే అధిష్టానంలో ఈ కదలికకు కారణమని తెలుస్తోంది. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు పాల్వాయి ఇటీవల సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఓ నోట్ ఇచ్చారు. దీనిపై ఆందోళన చెందిన పెద్దలు వెంటనే నేరుగా ఉప ఎన్నికలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications