మంత్రివర్గ రచన: ఫాంహౌస్లో కెసిఆర్ ప్లాన్?

ఇటీవల కెసిఆర్ మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. సెప్టెంబర్లోగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆయన పలుమార్లు చెప్పారు. అలా అని తనకు మాత్రమే సంకేతాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అవి నిజమే అన్నట్లుగా ఆయన ఇప్పుడు మంత్రివర్గంపై ఫాంహౌస్లో వ్యూహ రచన చేస్తున్నారట.
తెలంగాణ వస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలను స్వయంగా కాంగ్రెసు ప్రజాప్రతినిధులే ఖండించారు. కెసిఆర్ చెప్పినట్లుగా సెప్టెంబరులోగా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పారు. అయితే ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రం పోరాడాల్సిన అవసరముందని చెప్పారు. అయితే కాంగ్రెసు నేతలు అలా చెప్పినప్పటికీ ఆయన మాత్రం తెలంగాణ ప్రకటన తర్వాత మంత్రి మండలి, తెలంగాణ వచ్చాక మంత్రి మండలిపై ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కెసిఆర్ తెలంగాణ వచ్చాక మంత్రివర్గంలోకి టిఎన్జివో మాజీ అధ్యక్షుడు స్వామి గౌడ్ను తీసుకుంటామని ప్రకటించారు.
పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టినట్లుగా కెసిఆర్ ప్రకటన ఉందని పలువురు విమర్శలు కూడా గుప్పించారు. కానీ కేవలం స్వామి గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామనే ప్రకటనతోనే కెసిఆర్ సరిపెట్టకుండా ఇప్పుడు తెలంగాణ వస్తే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే దానిపై సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారట. అలాగే ప్రకటన వచ్చినప్పటికీ రాష్ట్రం వచ్చే వరకు, ఆ తర్వాత కేంద్రమంత్రివర్గంలో తాను, విజయశాంతి చేరే విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నారట.












Click it and Unblock the Notifications