2రోజుల హీట్: అసలేం జరిగింది, కిరణ్లో మార్పు
ఢిల్లీలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు మంత్రులు, కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ టూర్ ఎలా జరిగిందని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించగా... చాలా చాలా బాగా జరిగిందని నవ్వుతూ చెప్పారట. అంతేకాదు మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా శాఖాపరమైన అంశాల్లోకి వెళ్లిపోయారట. దీంతో, అసలు ఢిల్లీలో విశేషాలపై మంత్రులకు కూడా పూర్తి సమాచారం అందలేదు. శనివారం ముఖ్యమంత్రిని పలువురు మంత్రులు కలిశారు.
వీరిలో పలువురు వారి శాఖపరమైన అంశాలపై సిఎం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కిరణ్ కంటే మూడు రోజుల ముందే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సోనియాతో మినహా మిగిలిన ముఖ్యనేతలందరితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన రోజున పిసిసి అధ్యక్షుడిని తొలగిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. అదే సమయంలో సిఎంను కూడామారుస్తున్నట్లుగా మరోవర్గం ప్రచారం చేసింది. రాష్ట్ర ముఖ్య నాయకులిద్దరి నుంచి అధిష్ఠానం రాజీనామా పత్రాలను తీసుకుందని కూడా ప్రచారం జరిగింది.
దీనిని అధిష్ఠానం పెద్దలు ఎవరూ ద్రువీకరించలేదు. కిరణ్, బొత్స కూడా అంతా ఉత్తుతిదే అంటూ కొట్టిపారేస్తున్నారు. పైగా వారిద్దరూ ఉల్లాసంగా, ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. కొందరు మంత్రులు మాత్రం సిఎంను వ్యక్తిగతంగా కలిసినప్పుడు వివరాలపై ఆరా తీశారట. మీడియాలో వస్తున్నట్లుగా అధిష్ఠానం తనపై సీరియస్గా లేదని.. సుహృద్భావ వాతావరణంలోనే తన పర్యటన జరిగిందని వివరించారట. ఇదే సమయంలో మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహారం పైనా కొందరు మంత్రులు ఆరా తీశారట.
ఈ అంశంపై నిర్ణయాధికారాన్ని అధిష్ఠానం తనకే విడిచి పెట్టిందని... న్యాయ నిపుణులతో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని సిఎం స్పష్టం చేశారు. దీంతో, ఇప్పటికిప్పుడే ధర్మాన విషయంలో ఎలాంటి నిర్ణయాలూ ఉండకపోవచ్చని సిఎంను కలసి వచ్చిన మంత్రులు చెబుతున్నారు. ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా మెలిగే మరికొందరు మంత్రులు కూడా కిరణ్ను మారుస్తారన్న కథనాలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు.
కాగా... ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పించిందని ఒక సీనియర్ మంత్రి పేర్కొన్నారు. గతంలో మంత్రులు ఏదైనా చెబుతుంటే వినీ విననట్లుగా ఉండేవారని, ఢిల్లీ నుంచి వచ్చాక మారిపోయారని, తాము చెబుతున్నది ఆసక్తిగా విన్నారని, ఈ మార్పును స్వాగతించాల్సిందేనని చెబుతున్నారట.