గెలుపు, మెజార్టీపై టిఆర్ఎస్లో ఆందోళన?
పోచారం తిరిగి ఎన్నికైనా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 33వేల పైచిలుకు ఓట్లు రావటం నాడు టిఆర్ఎస్కు మింగుడు పడలేదు. ఈసారి కాంగ్రెస్తో పాటు, టిడిపి కూడా అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. జెఏసి సహచరి బిజెపి మహబూబ్నగర్లో యెన్నం శ్రీనివాస రెడ్డిని పోటీకి దించింది. అక్కడ లోక్సత్తా కూడా అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో గతం కంటే టిఆర్ఎస్ ప్రత్యర్థుల సంఖ్య పెరిగింది. త్వరలో నాగం తమ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే నమ్మకంతో ఉన్న గులాబీ దళం, ఆయన గెలుపు బాధ్యతనూ మోయాల్సి వచ్చింది. పైగా గతంతో పోల్చితే జెఏసిలోని మిగిలిన భాగస్వామ్యపక్షాలు గతంలోలా క్రియాశీలకంగా లేవు. కాంగ్రెస్, టిడిపిల నుంచి రాజీనామా చేసినవారు గులాబీ అభ్యర్థులుగా పోటీకి దిగటం ఆయా నియోజకవర్గాల్లో మొదటి నుంచి టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్న వారిలో అసంతృప్తిని రగిల్చింది. మొన్నటివరకు దిష్టిబొమ్మలు తగలబెట్టి, ఇళ్ల ముందు చావుడప్పు కొట్టి ఇప్పుడు వారితో కలిసి పనిచేయటానికి టిఆర్ఎస్ ముఖ్యులు చాలామంది ఇష్టపడటం లేదట.
మిగిలిన వారితో పోలిస్తే స్టేషన్ ఘనపూర్లో రాజయ్య, కొల్లాపూర్లో జూపల్లిలపై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం టిఆర్ఎస్కి తలనొప్పి వ్యవహారమైందని అంటున్నారు. మహబూబ్నగర్లో తెలంగాణ వాదంతోపాటు, మత, కుల సమీకరణాలను నమ్ముకోవాల్సి వచ్చింది. ఇన్ని చేసినా ఆరు నియోజకవర్గాలలో రెండు, మూడు చోట్ల పోటాపోటీ తప్పకపోవచ్చని టిఆర్ఎస్ నాయకత్వమే చెబుతోంది. గెలిచిన వారికి కూడా 2010 ఉప ఎన్నికల నాటి మెజార్టీలు రాకపోవచ్చని వారు చెబుతుండటం విశేషం. మొత్తానికి ఈ ఉఫ ఎన్నికల సమయంలో గతంలో కంటే భిన్న వాతావరణం నెలకొనడం టిఆర్ఎస్ వర్గాలలో ఆందోళనను రేకెత్తిస్తుందని అంటున్నారు.