ఢిల్లీ పీఠంపై నరేంద్ర మోడీ కన్నేశారా?

నిజానికి, శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర అంశాలు ప్రధాన ప్రచారాస్త్రాలు కావాలి. కానీ మోడీ అలా చేయలేదు. తనను వ్యతిరేకించి, వేరు పార్టీలు పెట్టుకున్న కేశూభాయ్ పటేల్ వంటివారిపై ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఎవరు వెళ్లిపోయినా తనకు ఏమీ ఢోకా లేదనే విశ్వాసమే ఆయనను నడిపించింది. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెసు పాత్రనే ఆయన లక్ష్యం చేసుకుని విమర్శలు చేశారు.
చిల్లర వర్తకంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడంపై కాంగ్రెసు మీద విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ తీరుపై విమర్శలు చేశారు. ముంబై కాల్పుల నిందితుడు అజ్మల్ కసబ్ను ఉరి తీసిన తర్వాత అఫ్జల్ గురు సంగతేమిటని అడిగారు. అంటే, దేశ రాజకీయాలను, దేశ రాజకీయ పరిణామాలను, కాంగ్రెసు విధానాలను ప్రశ్నిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. అయినా, ప్రజలు గుజరాత్లో మోడీకి పట్టం కట్టారు.
మోడీ తీరు చూస్తుంటే, ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఆకాంక్షను ఆ విధంగా వ్యక్తం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతూ వచ్చింది. గుజరాత్ ప్రజలు మోడీని ముఖ్యమంత్రిగా కోరుకుంటుంటే, దేశ ప్రజలు ఆయనను ప్రధానిగా కోరుకుంటున్నారనే విషయాన్ని చర్చకు తెచ్చింది. రాహుల్ గాంధీని ఎదుర్కునే సత్తా మోడీకి మాత్రమే ఉందనే అభిప్రాయానికి మరింత బలం చేకూరే విధంగా ఆయన వ్యవహరించారు.
మోడీకి జాతీయ రాజకీయాల్లో బిజెపి నుంచి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, గడ్కరీ వంటివారితో పోటీ ఉంది. బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీకి కూడా ఓసారి ప్రధానిగా కూర్చోవాలనే ఆశ ఉండదని అనుకోలేం. బిజెపి జాతీయ రాజకీయాలు మోడీని ముందుకు తెస్తాయా, అంతర్గత రాజకీయాలకు మోడీకి వ్యతిరేకంగా మారుతాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications