అటువైపు అడుగులేస్తున్న ఆ ఇద్దరు
మోహన్ బాబు తన తనయుడు విష్ణుతో కలిసి కొద్ది నెలల క్రితం అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్ను కలిశారు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు అడుగులు వేసేందుకే అనే అభిప్రాయం అందరిలో కలిగింది. అంతకుముందు జగన్ తన సతీమణి భారతి రెడ్డితో పాటు మోహన్ బాబు ఇంటికి వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ... జైలు వద్ద మోహన్ బాబు మాట్లాడిన మాటలతో ఆయన ఎటువైపు వెళ్తారో దాదాపు తెలిసిపోయిందని అంటున్నారు.
మోహన్ బాబు గురువుగా భావించే దాసరి కూడా క్రమంగా అటువైపు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, కొద్ది నెలల క్రితం జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ.. దర్శకరత్న సూచనల అలా చేశారట. దాసరి స్థానంలో రాజ్యసభ సీటును చిరంజీవికి ఇస్తారని చెప్పినప్పుడు మోహన్ బాబు తన గురువుకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత దాసరి పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే వంగవీటితో పాటు మోహన్ బాబుకు కూడా ఏ పార్టీలో చేరాలనే సూచనలు చేసి ఉంటారని చెబుతున్నారు. అందుకే జగన్ తమను కలువక ముందు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గినట్లుగా కనిపించిన మోహన్ బాబు ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడి వైపు అడుగులు వేస్తుండటం వెనుక దాసరి ఉండవచ్చునని అంటున్నారు. 2014 ఎన్నికల్లోపు దాసరి అఢుగులు కూడా ఇటువైపు పడతాయని అంటున్నారు.