కిరణ్, బొత్సలకు జగన్ విసిరిన సవాల్
ఈ ఎన్నికల తర్వాత కొన్నాళ్లకే వచ్చే ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు అద్దం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైన పది జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాలకుగాను విజయనగరం, కృష్ణా, చిత్తూరు మినహా మిగిలిన పది జిల్లాల్లో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలు కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపుతాయని అధికారపక్ష నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం టిడిపి కంటే కాంగ్రెస్కే కీలకమని అధికారపక్ష నేతలు భావిస్తున్నారు. ఇప్పటివరకూ టిడిపినే ప్రధాన శత్రువుగా భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీనీ ప్రత్యర్థిగా భావించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పటినుంచే క్షేత్ర స్థాయిలో బలమైన నేతలను గుర్తించాలని నేతలు కోరుకుంటున్నారు. దీనివల్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలం పుంజుకుంటారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ జగన్పై దీటైన విమర్శలు చేయడంలో పార్టీ నేతలు వెనుకబడ్డారని ఇక ఆ మౌనానికి ఫుల్స్టాప్ పెట్టాలన్న భావన పెరుగుతోంది.
జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడిన తర్వాత వారితో కాంగ్రస్ పార్టీకి ఉన్న కొద్దిపాటి బంధం కూడా తెగిపోయిందని ఇక వారిని ప్రత్యర్థులుగానే చూడాలని పలువురు నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలు జరిగే 16 స్థానాలూ కాంగ్రెస్ పార్టీవేనని, పిఆర్పీస్థానం కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తున్నందున వీటన్నింటినీ చేజిక్కించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. ఈ దిశగా తాము వ్యూహాలను రూపొందిస్తామని చెబుతున్నారు. కాగా ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు జగన్ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇదే సరైన సమయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ పదిహేడు స్థానాలూ కాంగ్రెసువే కావడం చేత వారికి ఇది అసలైన పరీక్షా కాలం అంటున్నారు. ఎమ్మెల్యేలు పలుమార్లు అధిష్టానానికి సవాల్ విసిరి మరీ వేటు వేయించుకున్నారు. అంటే 2014 ఎన్నికలకు ముందు జగన్... కిరణ్, బొత్సలకు విసిరిన అతి పెద్ద సవాల్ అనే చెప్పవచ్చు.