టార్గెట్ జగన్: 'వైయస్'పై కాంగ్రెస్ స్కెచ్?

శనివారం ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో వైయస్ పాలన, జగన్ అవినీతి విడదీయరానివని, వాటిని వేరువేరుగా ఎలా చూస్తామని మంత్రి రామచంద్రయ్య ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వైయస్ మంచోడు, జగన్ అవినీతిపరుడు అంటే జనం ఎలా నమ్ముతారని, ఆయన ఒక్కడే అవినీతికి ఎలా పాల్పడగలరని మరో మంత్రి మహీధర్ రెడ్డి ప్రశ్నించారట.
మొదటి నుండి జగన్పై విరుచుకు పడుతున్న కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి.. అవినీతికి మూల విరాట్ వైయస్సేనని, నిర్ణయాలు కెబినెట్లో, లాలూచీలు జగన్ ఇంట్లో నడిచేవని, జగన్ చేతిలో వైయస్ రిమోట్ అని అన్నారని తెలుస్తోంది. జగన్ అవినీతిలో వైయస్ భాగస్వామ్యం విడదీయరానిదని, మనం వైయస్ను మర్చిపోవాలని ఎంపి జెడి శీలం అన్నారని తెలుస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలను శీలం కొట్టి పారేశారు. తాను కేవలం స్పష్టత ఇవ్వాలని మాత్రమే సూచించానని చెప్పారు.
ఎంపి సర్వే సత్యనారాయణ మరింత ముందుకెళ్లి వైయస్ సిఎం పదవిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని కొడుక్కి దోచి పెట్టారని, దేశంలో ఎవరూ చెయ్యనంత అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో మండిపడ్డారట. పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గోడమీద పిల్లుల్లా తయారయ్యారని, వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సూచించారని తెలుస్తోంది.
ఆయితే వారి వ్యాఖ్యల పట్ల సిఎం, పిసిసి చీఫ్ ఏకీభవించలేదని తెలుస్తోంది. వైయస్ పాలన అవినీతిమయమని చెప్పలేమని, సమయాన్ని బట్టి స్పందించాలని, వైయస్ను తిడితే మంత్రులు మాత్రం అవినీతిలో భాగస్వాములు కారా అనే ప్రశ్న తలెత్తుతుందని వారు నేతలకు హితబోధ చేశారట. జగన్ను, తెలుగుదేశం పార్టీని ఇద్దరినీ ప్రత్యర్థులుగానే చూడాలని సూచించారట.
అయితే అవినీతిలో వైయస్ను, జగన్ను వేరు చేసి చూడలేమనే అభిప్రాయం కాంగ్రెస్లో క్రమంగా బలపడుతోందంటున్నారు. నామమాత్రపు కేబినెట్ పేరిట సాగిన తెరచాటు బాగోతాల గుట్టు తమ కొంప ముంచుతోందని కాంగ్రెసు నేతలుఅభిప్రాయపడుతున్నారట. ముందు ముందు ఇది మరింత బలపడే అవకాశం కనిపిస్తోందంటున్నారు. ఉప ఎన్నికల్లో ఇదే ప్రధాన ప్రచారాస్త్రం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications