తెలంగాణ ఫైట్: కెసిఆర్ వెయిట్ అండ్ సీ!
ఈ క్రమంలోనే తెరాస ఈ నెల 24 నుంచి ప్రారంభం కావాల్సిన పార్టీ సమావేశాల వాయిదా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై కేంద్రానికి తెరాస అధినేత కెసిఆర్ విధించిన గడువు ఈ నెల 20తో ముగిసింది. ఆలోపు కేంద్రం తెలంగాణ ఇస్తే సంబరం.. లేకపోతే సమరమని చెప్పిన గులాబీ దళపతి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కోసం ఈనెల 24, 25, 26 తేదీల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సమావేశాలను ఇప్పుడు కాకుండా సెప్టెంబర్ మొదటి పక్షంలో నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు.
ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతుండటం, ఈలోపే కాంగ్రెస్ కోర్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ సమావేశాలు పలు దఫాలు జరిగే అవకాశం ఉండటం, వాటిల్లో తెలంగాణ అంశం ప్రస్తావనకు వస్తుందని భావిస్తుండటం, పార్లమెంటు సమావేశాల్లోపు లేదా ముగిసిన తర్వాత కేంద్రం తెలంగాణపై ఒక ప్రకటన చేస్తుందనే విశ్వాసం వంటి కారణాలు పార్టీ సమావేశాల వాయిదా నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేశాయని పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఒకరు తెలిపారు.
ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తే తెలంగాణ సాధన కోసం ఏదో ఒక కార్యాచరణ తీసుకోవాల్సిందేనని, కేంద్రం నుంచి తెలంగాణపై ఒక నిర్ణయం వస్తుందనే వార్తల నేపథ్యంలో కార్యాచరణ తీసుకోవటం రాజకీయంగా తమకు ఇబ్బంది అని, అలాగని సమావేశాలు నిర్వహించి కార్యాచరణ తీసుకోకుంటే బాగుండదని, ఇప్పటికే సిపిఐ, బిజెపి కార్యాచరణ ప్రకటించాయని, తెలంగాణ మార్చ్ పేరిట సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ జెఏసి వెల్లడించి.. దానిని విజయవంతం చేసే దిశగా సాగుతోందని చెబుతున్నారు.
ఈక్రమంలో పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ తీసుకోకుండా బద్నాం కావటం కంటే పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యే వరకు ఓపిక పట్టి.. కేంద్రం నుంచి తెలంగాణపై నిర్ణయం వస్తుందో? రాదో? వేచి చూసి ఆ తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించటమే మేలని కెసిఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.