సభలో సమైక్యం: గట్టెక్కేందుకు ఆంటోనీ కమిటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు విభజన సెగ తగలకుండా ఉంచే ఉద్దేశ్యంలో భాగంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం తమ పార్టీ సీమాంధ్ర నేతలను బుజ్జగించేందుకే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందనే ప్రచారం సాగుతోంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యవాదం ఉవ్వెత్తున ఎగుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... ఇలా అందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎనిమిది రోజులుగా ఉద్యమం కొనసాగుతోంది.
సమైక్యవాదుల హెచ్చరికల నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ సభ్యులు లోకసభ, రాజ్యసభలలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని వారు సభలను అడ్డుకుంటున్నారు. మొదటి రెండు రోజుల సభలో వాయిదా పర్వాలు నడిచాయి. సభను టిడిపి, కాంగ్రెసు ఎంపీలు అడ్డుకుంటున్నారు. అధిష్టానం హెచ్చరించినా కాంగ్రెసు ఎంపీలు ఏమాత్రం తగ్గడం లేదు.

మరోవైపు సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర కోసం అధిష్టానం పెద్దలతో జోరుగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీకి శ్రీకారం చుట్టింది. ఈ కమిటీలో ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్లు ఉన్నారు. సీమాంధ్రులకు ఎలాంటి సమస్య ఉన్నా వారికి చెప్పుకోవచ్చునని తెలిపారు. అయితే ఈ కమిటీ సమావేశాలు సజావుగా సాగించే ఉద్దేశ్యంలో భాగంగా సీమాంధ్ర నేతలను బుజ్జగించేందుకు వేశారని అంటున్నారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు సీమాంధ్రుల నుండి వచ్చే ఒత్తిడిని ఎలాగోలా ఎదుర్కోవాలని అధిష్టానం యోచిస్తోంద. అందుకే ఇప్పుడు కమిటీకి తెర లేపిందంటున్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న ఆ నలుగురికి ఎపి విషయం కొత్త కాదని, అంతేకాకుండా సిడబ్ల్యూసి, కోర్ కమిటిలో పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతనే వీరంతా విభజనకు అనుకూలంగా నిర్ణయం వెలువరించారని చెబుతున్నారు.
అలాంటప్పుడు ఈ కమిటీ వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదంటున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను శాంతపర్చడం, ఢిల్లీలో ఏదైనా జరుగవచ్చుననే అభిప్రాయం కల్పించడం కోసమే కమిటీని వేసి ఉంటారని అంటున్నారు. ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ... తాము నిర్ణయం తీసుకున్నామని, వెనక్కి వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టారని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ కమిటీ సీమాంధ్రుల సమస్యలు విని వారికి విభజన తప్ప.. మిగిలిన సమస్యల పరిష్కారానికి హామీ మాత్రమే ఇస్తుందని అంటున్నారు.
అంతేకానీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెబుతున్నట్లుగా విభజన జరగాలా, వద్దా అనే అంశం పైన మాత్రం కాదంటున్నారు. మరోవైపు ఆంటోనీ అధినేత్రి సూచనలకు వ్యతిరేకంగా వెళ్లబోరని, ఆ మాటకు వస్తే కమిటీ సభ్యులు అందరూ అంతే అంటున్నారు. సోనియా ఏది చెబితే అదే చేస్తారని అంటున్నారు. తెలంగాణపై ఇప్పటికే సోనియా కుండబద్దలు కొట్టినందున సమావేశాల్లో గట్టెక్కేందుకు మాత్రమే కమిటీకి తెరలేపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications