పాదయాత్ర: వైయస్తో చంద్రబాబుకు పోలికా?
హైదరాబాద్: గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి యాత్రను పోల్చవచ్చునా అనేది ప్రశ్న. వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రకు, చంద్రబాబు నడకలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ పోలిక లేదు. దూరాన్ని బట్టి చూస్తే చంద్రబాబు వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర రికార్డును చంద్రబాబు బద్దలు కొట్టారు. అంత మాత్రాన పోలిక తేవడం సరైందేనా అనేది ప్రశ్న.
వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు కాంగ్రెసులో ఏకైక నాయకుడిగా ముందుకు రావడానికి పాదయాత్ర చేశారు. అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు ఆయనను నాయకుడిగా గుర్తించడానికి అది పనికి వచ్చింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి మరో నాయకుడు పోటీ పడకుండా వైయస్ రాజశేఖర రెడ్డికి పాదయాత్ర ఉపయోగపడింది. కాంగ్రెసు పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఆయనను పాదయాత్ర ముందుకు తెచ్చింది.

పాదయాత్ర చేసే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి తన కాంగ్రెసు పార్టీకి సంబంధించే పరిమితులు ఉన్నాయి. తన ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడానికి ఆయనకు వీలు కాలేదు. పార్టీ అధిష్టానం, ఇతర కాంగ్రెసు నాయకులు ఆయన ఇచ్చే హామీలను అంగీకరించాల్సి ఉంటుంది. అందువల్ల ఆయన పరిమితంగానే ప్రజలకు హామీలు ఇచ్చారు.
కాగా, వైఎస్ పాదయాత్రకు, చంద్రబాబు పాదయాత్రకు మధ్య రెండు ప్రధాన తేడాలున్నాయి. చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ పదేళ్ల తక్కువ వయసులో పాదయాత్ర చేశారు. అందుకే, ఆయన కొంతవరకు సునాయాసంగా పాదయాత్ర చేయగలిగారన్నది కొందరి అభిప్రాయం. కానీ, 63 ఏళ్ల వయసులో ఇంత సుదీర్ఘ పాదయాత్ర సహజంగానే చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే చూపింది.
వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న పరిమితులు చంద్రబాబుకు లేవు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆయన నాయకత్వాన్ని అంగీకరించాల్సిందే. ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తేనే ఎవరైనా పార్టీలో ఉంటారు. పైగా, తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్థాయి అనుభవం ఉంది. తన పాదయాత్రలో హామీలు ఇవ్వడానికి చంద్రబాబుకు ఏ విధమైన ఆంక్షలు లేవు. ఆయన మాట కాదనేవారు లేరు.
అయితే,త పాదయాత్ర ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి పొందగలిగినంత ప్రచారాన్ని చంద్రబాబు పొందలేకపోయారనే అభిప్రాయం ఉంది. అప్పట్లో రాష్ట్రంలో ప్రతిపక్షం యావత్తూ వైయస్ నాయకత్వం కింద సమీకృతమైంది. ఆ సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుకు ఏకైక ప్రత్యామ్నాయంగా వైయస్ మాత్రమే ఉన్నారు. దాంతో ఆయనకు ఆ ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. కానీ, చంద్రబాబు పాదయాత్ర సమయానికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేక శిబిరాలుగా చీలిపోయి ఉన్నాయి.
ఇప్పుడు ప్రత్యామ్నాయ పాత్ర పోషణలో అనేక పార్టీలు తెరపైకి వచ్చాయి. అందుకే, చంద్రబాబు పాదయాత్రకు అంత స్థాయిలో ప్రచారం రాలేదనేది కొందరి అభిప్రాయం. అప్పట్లో తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచి ఎన్నికల్లో గెలుపు సాధించడంలో వైయస్ సఫలమయ్యారు. చంద్రబాబు కూడా తన పాదయాత్రలో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడంతోపాటు దాని ఫలాలను తాను మాత్రమే పొందడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆ ఫలితం ఆయనకు దక్కుతుందో లేదో ఎదురు చూడాల్సిందే. ప్రతిపక్షాల్లో కాంగ్రెసుతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా దెబ్బ కొట్టడానికి ఇతర రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి.












Click it and Unblock the Notifications