డిఎల్ ఉద్వాసన క్రైసిస్: కిరణ్ రెడ్డికి చిక్కులు
డిఎల్ రవీంద్రా రెడ్డిని తప్పించిన పద్ధతి సరి కాదని సీనియర్ మంత్రులు వాదిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి వరకు అదే మాట అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. డిఎల్ ఉద్వాసనను సాకుగా తీసుకుని ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై చిట్టా విప్పుతున్నారు.
బహిరంగంగా విమర్శలు చేస్తున్నవారిని పక్కన పెడితే కేంద్ర మంత్రి చిరంజీవి ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమైన నేతగా ముందుకు వచ్చారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉంటూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకులకు డిఎల్ ఉద్వాసన వ్యవహారం అంది వచ్చింది. వారి చేతిలో అది అస్త్రంగా మారింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా డిఎల్ రవీంద్రారెడ్డికి సంఘీభావం పలికినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం డీఎల్కు జైపాల్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు.
రాష్ట్ర నేతలు ఒకరితర్వాత ఒకరు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానానికి డిఎల్ వ్యవహారాన్ని వివరిస్తూ ఇతర విషయాలను కూడా వివరిస్తున్నారు. మంత్రి వట్టి వసంతకుమార్పై కూడా వేటు పడుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి వట్టి వసంతుకుమార్ను పిలిపించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్యను సోనియాతో మాట్లాడి చిరంజీవి రక్షించుకున్నట్లు చెబుతున్నారు.
ఓ వైపు ఇంకా కొంత మంది మంత్రులపై వేటు పడుతుందునే ప్రచారం సాగుతుండగానే, ఇక మంత్రులు ఉద్వాసన ఉండకపోవచ్చుననని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నారు. మొత్తం మీద, డిఎల్ వ్యవహారం కాంగ్రెసులో మరోసారి చిచ్చు పెట్టింది.