ఎంపీల సస్పెన్షన్: 374ఎ రూల్ ఏమిటి?
హైదరాబాద్: తనకు 374ఎ నిబంధన కింద సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించి స్పీకర్ మీరా కుమార్ 12 మంది సీమాంధ్ర లోకసభ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వారి సస్పెన్షన్కు ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని బిజెపి నేత సుష్మా స్వరాజ్ వ్యతిరేకిస్తూ ఓటింగును కోరడంతో ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకుంది. అయితే, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ మీరా కుమార్ శుక్రవారం 12 మంది సభ్యులను 374ఎ నిబంధన కింద సస్పెండ్ చేశారు.
ఏ విధమైన తీర్మానం లేకుండా స్పీకర్ సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు సభ్యులను సస్పెండ్ చేయడానికి ప్రయోగించిన 374ఏ నిబంధన ఏమిటనే విషయంపై ఆసక్తి ఉండడం సహజమే. సభా కార్యక్రమాలను అడ్డుకునే సభ్యులపై 373, 374లోని 1, 2, 3 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఇవేవీ కాదని 374(ఏ) ప్రయోగించిన విషయం తెలిసిందే.

సభ్యులపై చర్యలకు సంబంధించి 374ఏ మరింత ప్రత్యేకమైంది. ఒక సభ్యుడు లేదా కొందరు సభ్యులు అదే పనిగా, నిరంతరాయంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, నినాదాలు చేయడం, సభామధ్యలోకి దూసుకురావడం వంటివి చేస్తే 374ఏ నిబంధన కింద స్పీకర్ ఆ సభ్యుల పేర్లు చదివి వినిపిస్తారు. దాంతో దానంతటదే వారిపై సస్పెన్షన్ వేటు పడుతుంది.
ఐదు రోజులు గానీ, సమావేశాలు ఎన్ని రోజులు మిగిలి ఉంటే అన్ని రోజులు (ఏది తక్కువ అయితే అది) సస్పెన్షన్ వర్తిస్తుంది. సస్పెన్షన్ను ఎత్తివేయాలని భావిస్తే సభలో తీర్మానాన్ని ప్రతిపాదించి, ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, సస్పెండ్కు గురైన 12 మంది ఎంపీలు 374ఏ కింద స్పీకర్ స్వయంగా సస్పెండ్ చేయడంతో వారిపై ఎన్ని రోజులు సస్పెన్షన్ వేటు పడిందనే విషయం తెలియలేదు.
తీర్మానం, ఆమోదం వంటివేవీ లేకుండానే వేటుపడటంతో కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు 374ఏ నిబంధన గురించి లోక్సభ అధికారులను అడిగి తెలుసుకుని మౌనంగా ఉండిపోయారు. నిజానికి, స్పీకర్ రూలింగ్ ఇస్తే దానికి తిరుగు ఉండదు. దాన్ని ప్రశ్నించడానికి కూడా వీలు లేదు. అటువంటి విశేషాధికారాలు చట్టసభల స్పీకర్కు ఉన్నాయి.












Click it and Unblock the Notifications