బిజెపిదే హవా!: ప్రియాంక పోటీ పడినా మోడీదే..!!
వచ్చే లోకసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎసి నీల్సన్ - ఎబిపి న్యూస్ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు ప్రధాని అభ్యర్థి కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యుపిఏపై ఎన్డీయేదే పైచేయి అని సర్వేలో వెల్లడయింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే నరేంద్ర మోదీకే ప్రజల ఓటు వేశారు.
'దేశ ప్రజల మనోభావం' పేరిట ఈ సర్వే జరిపారు. ఎన్నికలు జరిపితే ఎన్డీయేకు ఓటు వేస్తామని 40 శాతం మంది చెప్పారని, యూపిఏకు ఓటేసిన వారు కేవలం 27 శాతమేనని తెలిపింది. బిజెపికి 36 శాతం మంది జైకొడితే.. కాంగ్రెస్కు ఓటు వేస్తామన్నవారు 22 శాతమేనని వివరించింది. ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనితీరు అత్యంత దారుణంగా ఉందని, ఉత్తరాది ప్రజలు అయితే ఆయన పని తీరుపై పూర్తి స్థాయిలో పెదవి విరిచేశారని తెలిపింది.
యూపిఏ 2 పనితీరు కంటే మన్మోహన్ పనితీరు మరింత అధ్వానంగా ఉందని వివరించింది. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు బిజెపికి ఓటేశారని, మరీ ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య యువత కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. దక్షిణాదిలో మాత్రం బిజెపి, కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్లు ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రధాని రేసులో మోడీయే ముందంజలో ఉన్నారని, 60 శాతం మందికి పైగా ఆయన పనితీరు బాగుందని కితాబు ఇచ్చారని వివరించింది.
ప్రధాని అభ్యర్థిగా మోడీకి 47 శాతం మంది జైకొడితే.. రాహుల్ గాంధీకి 18 శాతం, మన్మోహన్కు 14 శాతం మంది మాత్రమే ఓటేశారు. దక్షిణాది మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మోడీకే జైకొట్టారని, దక్షిణాదిలో మాత్రం మోడీ, రాహుల్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతోందని తెలిపింది. ఉత్తరాది ప్రజలు, యువత, సంపన్న వర్గాలు మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాయని వివరించింది. ప్రియాంక గాంధీ కంటే కూడా మోడీకే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉందని అభిప్రాయపడ్డారు.
ఒకవేళ, మోడీ, ప్రియాంక గాంధీ మధ్య పోరు జరిగినా బిజెపికే ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక దుస్థితికి ప్రధానియే కారణమని 40 శాతం మంది అభిప్రాయపడితే.. దక్షిణాదిలోని 45 శాతంమంది మాత్రం ఇందుకు కారకుడు ఆర్థిక మంత్రి చిదంబరం అని స్పష్టం చేశారు. యుపిఏ పనితీరుపై ఉత్తరాదిలోని 42 శాతం మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలింది.
రాజకీయాలను కుల, మతాలతో కలుషితం చేయడంలో బిజెపికి ఎంత పాత్ర ఉందో కాంగ్రెస్కు కూడా అంతే పాత్ర ఉందని స్పష్టం చేశారు. దేశంలో బలమైన నాయకత్వం, దృఢసంకల్పం, నిర్ణయాత్మక శక్తి, సత్వరమే చర్యలు తీసుకునే నాయకత్వం కరువైందని వారు భావించారు. ఈ అన్ని విషయాల్లో రాహుల్ కంటే మోడీయే బెటరని స్పష్టం చేశారు.