తూగని లెక్క: తెలంగాణ కన్నా జగన్ కట్టిడికే..
రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి పదవులలో తెలంగాణ కంటే సీమాంధ్రకే ఎక్కువగా ఉన్నాయి. దీనిని బట్టి చూసినా జగన్ పైనే ఎక్కువగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ, మరోవైపు జగన్ ప్రభావం నేపథ్యంలో కాంగ్రెసు గతంలో ఎప్పుడు ఇవ్వనంత ప్రాధాన్యత కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి ఇచ్చింది. అయితే ఇందులో తెలంగాణ కంటే సీమాంధ్ర నేతలకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు.
తెలంగాణ ప్రాంతం నుండి కేబినెట్ ర్యాంక్ మంత్రి జైపాల్ రెడ్డి మాత్రమే ఉన్నారు. సర్వే సత్యనారాయణ, బలరామ్ నాయక్లు మంత్రులుగా ఉన్నారు. అదే సీమాంధ్ర నుండి కేబినెట్ ర్యాంక్ మంత్రులు ముగ్గురు ఉన్నారు. ఒకరు ఇండిపెండెంట్ చార్జ్ తీసుకున్నారు. కిషోర్ చంద్రదేవ్, పళ్లం రాజు, కావూరి సాంబశివ రావులు కేబినెట్ ర్యాంక్ మంత్రులు. పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఇండిపెండెంట్ చార్జ్ తీసుకున్నారు.
మరో ఐదుగురు మంత్రులుగా ఉన్నారు. అందులో దగ్గుపాటి పురంధేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలంలు ఉన్నారు. ఇరు సభల్లో కలిసి 16 స్థానాలున్న తెలంగాణ ప్రాంతం నుండి ముగ్గురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించగా.. 25 స్థానాలున్న సీమాంధ్రలో తొమ్మిది మందికి అవకాశం లభించింది.
దిగ్విజయ్, కావురి, శీలం దేనికి సంకేతం?
తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన దిగ్విజయ్ సింగ్కు వైయస్ రాజశేఖర రెడ్డి వర్గంతో మంచి సంబంధాలున్నాయి. అదే సమయంలో సమైక్యాంధ్ర గళం వినిపిస్తున్న కావూరి, జెడి శీలంలకు ఈసారి చోటు దక్కింది. వీరికి అవకాశం వెనుక తెలంగాణను లైట్గా తీసుకొని, జగన్ పైన దృష్టి సారించినట్లుగా కనిపిస్తోందని అంటారు.