విలీనంపై సోనియా యూ టర్న్: కెసిఆర్‌కు రివర్స్

Sonia Gandhi - K Chandrasekhar Rao
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితిని తమ పార్టీలో విలీనం చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనంతట తాను విలీనం ప్రతిపాదన చేస్తేనే స్పందించాలని లేదంటే పక్కన పెట్టాలని భావిస్తున్నారట. అయితే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెరాస నేతలు కాంగ్రెసు పార్టీ వైపు క్యూ కడుతున్నారు. ఇది కెసిఆర్‌కు కలవరం కలిగిస్తోందంటున్నారు.

మొన్నటి వరకు కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీల నేతలు తెరాసలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించారు. తెరాస ఆ పార్టీ వారిపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తెరాస నేతలపై ఆ ప్రయోగం చేస్తోంది. దీంతో గులాబీ రేకులు ఒక్కొక్కటిగా విడిపోతున్నాయి. మొదటి నుంచి తెరాస అగ్రనాయకత్వం పట్ల ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నవారు ఇప్పుడు బయట పడుతున్నారు. తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఇద్దరు ముఖ్య నేతలు బయటకు వెళ్లారు! మెదక్ ఎంపి విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకే ఆమెపై సస్పెండ్ వేటు వేశారు. దీంతో ఆమె ఈ రోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు విజయరామ రావు కూడా బుధవారం రాత్రి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు నేతలు కాంగ్రెసు పెద్దలతో టచ్‌లో ఉన్నారట.

ఇన్నాళ్లు ఆపరేషన్ ఆకర్ష్ ఉత్సాహంలో ఉన్న కెసిఆర్.. ఇప్పుడు ఆపరేషన్ వికర్ష్ ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రులు ఎ చంద్రశేఖర్, విజయ రామారావు, అజ్మీరా చందూలాల్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలవడం తెరాస వర్గాల్లో కలకలం సృష్టించింది. తెలంగాణపై అనుకూల ప్రకటన చేసినందుకు ధన్యవాదాలు చెప్పేందుకే తాము వెళ్లినట్లు ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో చెప్పారు.

దీంతో కెసిఆర్ మంగళవారమే విజయ రామారావును మెదక్ జిల్లాలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ రామారావు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఆయన గతంలో పోటీ చేసిన వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యను తెరాసలోకి తీసుకొచ్చి, ఆయనతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకున్నారు.

దీంతో విజయ రామారావు వరంగల్ ఎంపి స్థానంలోనైనా పోటీ చేద్దామనుకున్నారు. కానీ టిడిపి నేత కడియం శ్రీహరిని తెరాసలోకిచేర్చుకుని వరంగల్ ఎంపి సీటును రిజర్వు చేశారు. దీంతో విజయ రామారావుకు నియోజకవర్గం లేకుండా పోయింది. పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని భావిస్తున్న ఆయన ఇప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎ చంద్రశేఖర్ కూడా పార్టీ అగ్రనాయకులపై ఆగ్రహంగా ఉన్నారట.

తన సొంత నియోజకవర్గం వికారాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ప్రసాద రావును తెరాస సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు తెరాసలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారట. కాంగ్రెసు అనుకూల ప్రకటన నేపథ్యంలో ప్రసాద రావు మారే అవకాశాలు లేవు. దీంతో చంద్రశేఖర్ కూడా కాంగ్రెసులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు. చందూలాల్ కూడా ఒకింత అసంతృప్తితోనే ఉన్నారట.

తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు బుధవారం మంత్రి జానారెడ్డిని కలిశారని, ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. మరో పార్టీలోకి వెళ్లటానికి ఎవరూ సిద్ధంగాలేరని తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బుధవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో చెప్పారు. పార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

అయితే కాంగ్రెసు పార్టీ మాత్రం విలీనం భారం కెసిఆర్ పైననే వేసింది. ఆయన స్పందించే వరకు మాత్రం తెరాస నుండి వలసలను ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేసుకుందట. విజయశాంతి, విజయ రామారావు బాటలో మరికొంతమంది ముఖ్యనేతలు నడిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఒకవేల కెసిఆర్ విలీనంకు ముందుకు వచ్చినా భారీ షరతుల్లేకుండా చూసుకునే క్రమంలోనే కాంగ్రెసు ఇలా వ్యవహరిస్తోందనే వాదన కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+