ఎపి కోసం బాబు ప్లాన్: ఢిల్లీ, బెజవాడ, హైద్రాబాద్ల్లో
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారంలో రెండు రోజులు విజయవాడలో, రెండు రోజులు హైదరాబాద్, మరో రెండు రోజులు ఢిల్లీలో ఉండేలా ప్రణాళికలు రూపొందించుకున్నారని తెలుస్తోంది. మిగిలిన ఒక్క రోజు ఇతర అంశాల పైన దృష్టి సారించనున్నారట. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం, రాష్ట్ర అభివృద్ది అంత సులభం కాదని అభిప్రాయపడుతున్నారు.
ఇందుకోసం పక్కా ప్రణాళికతో వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. హైదరాబాద్ నుండి కొత్త రాజధానికి పూర్తిగా తరలి వెళ్లేలోగా ఢిల్లీలో సాధించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా పలువురికి బాధ్యతలు అప్పగించడంతో పాటు, స్వయంగా తను రెండురోజులు అక్కడే మకాం వేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు ముంపు మండలాలను ఎపిలో కలిపేలా చంద్రబాబు కృషి చేశారని తెరాస వర్గాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

ఇచ్ఛాపురం నుండి తడ వరకు ఆరు వరుసల కోల్కతా - చెన్నై జాతీయ రహదారి, ఆయా జిల్లాల నుండి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైలు వసతిని కల్పించడంపై దృష్టి సారించనున్నారు. రాయలసీమ నుండి రవాణా వసతులు మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నారట. దుగరాజపట్నం, బందరు పోర్టులతో పాటు పదికి పైగా భారీ ప్రతిపాదిత ప్రాజెక్టులు కోస్తాకు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమల స్తాపనకు ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారట. ఇలాగే జాతీయ రహదారులను, సాగునీటి ప్రాజెక్టులను రాయలసీమలో వేగవంతంగా నిర్మింప చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో ఇతర నగరాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications