బాబు వ్యూహం: పవన్ కల్యాణ్పై సైలెంట్, డోంట్ కేర్ జగన్
Recommended Video

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఎదురు పక్షాల విమర్శలకు తోక తొక్కిన తాచుల్లా లేచే తెలుగుదేశం పార్టీ నాయకులు వారిద్దరి పట్ల కూడా మౌనంగానే ఉంటున్నారు. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే టిడిపి నాయకులు మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

మౌనంతోనే ఫలితాలు సాధించాలని...
పవన్ కల్యాణ్ పట్ల గానీ, జగన్ పట్ల గానీ మౌనం పాటించడం ద్వారానే ఫలితాలు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, తెలుగుదేశం పార్టీ జగన్, పవన్ కల్యాణ్ల పట్ల వేర్వేరు వైఖరి అవలంబిస్తోంది. అయితే, వ్యూహం మాత్రమే ఒక్కటే. ఇరువురి విమర్శలకు సమాధానం చెప్పకపోవడమే వ్యూహం.

పవన్ కల్యాణ్ పట్ల సంయనం
నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, తెలుగుదేశం ప్రభుత్వంపై కూడా ఏదో మేరకు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.అయితే పవన్ కల్యాణ్ పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమనం పాటిస్తోంది. పవన్ కల్యాణ్ను ఇప్పటికీ చంద్రబాబు మిత్రుడిగానే భావిస్తున్నారు. అందుకే సంయమనం పాటించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

పవన్ కల్యాణ్కు సానుకూల స్పందన
పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలపై సానుకూల స్పందన వ్యక్తం చేయడం లేదా వివరణ ఇవ్వడం మాత్రమే టిడిపి చేసింది. ఎదురుదాడికి మాత్రం దిగలేదు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణపై పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను టిడిపి సమర్థించింది. కార్పొరేషన్ ప్రైవీటీకరణ సమర్థనీయం కాదని, దానిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై వివరణ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కల్యాణ్ చేసిన డిమాండ్పై తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది. అన్ని వివరాలను అసెంబ్లీలో చెప్పామని, ఆన్లైన్లో కూడా సమాచారం ఉందని, అందువల్ల శ్వేత పత్రం అవసరం లేదని తెలుగుదేశం పార్టీ చెప్పింది.

దేవినేని ఉమ వివరణ
పోలవరం నిర్మాణానికి పెట్టిన ఖర్చుల్లో ఏ కాంట్రాక్టు సంస్థకు ఎంతెంత మొత్తం చెల్లింపులు జరిగాయనే వివరాలను మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు బహిరంగంగా మీడియాకు విడుదల చేశారు. ఆ రకంగా పవన్ కల్యాణ్ విమర్శలకు సానుకూలంగా స్పందించే వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అనుసరిస్తూ వస్తోంది.

లోకేష్పై విమర్శలు చేసినా...
మంత్రి లోకేష్ మీద, పార్టీ మీద పవన్ కల్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడినా తెలుగుదేశం పార్టీ ప్రతిస్పందించలేదు. గత ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ను ఇప్పటికీ మిత్రుడిగానే తెలుగుదేశం పార్టీ భావిస్తూ వస్తోంది. ఆయనపై విమర్శలు వద్దని పార్టీ చంద్రబాబు పార్టీ నాయకులకు ప్రత్యేకంగా సూచించినట్లు తెలుస్తోంది. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా మౌనమే పాటించారు.

జగన్పై వ్యూహం ఇదీ..
జగన్ ప్రజా సంకల్ప యాత్రను పట్టించుకోవద్దని, దానిపై ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబు పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జగన్పై మాట్లాడితే అనవసరమైన ప్రచారం కల్పించినట్లు అవుతుందని, పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు కూడా మరిచిపోతారని టిడిపి వ్యూహంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications