మోడీ హవా ఉన్నా నవీన్ను ఢీకొట్టడం వీజీ కాదు
‘పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు’ ప్రతిచోటా మనమే విజయం సాదించాలి అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజా నినాదం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019 ఎన్నికల నాటికి మరింత
న్యూఢిల్లీ: 'పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు' ప్రతిచోటా మనమే విజయం సాదించాలి అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాజా నినాదం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయంతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019 ఎన్నికల నాటికి మరింత విస్తరించాలన్నది కమలనాథుల ఎత్తుగడ.
ఇప్పటి నుంచి రెండేళ్లలో జరిగే లోక్ సభ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించాలని, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్నది అమిత్ షా సంకల్పం. గత వారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 13 రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోదీ క్యాబినెట్ మంత్రులంతా పాల్గొన్నారు.
అంతే కాదు జాతీయ కార్యవర్గం భేటీ ప్రారంభానికి ముందు భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వరకు నిర్వహించిన రోడ్ షోలో లభించిన ప్రజాదరణ.. ఒకనాడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి లభించిన జనాదరణను తెలియజేస్తున్నది. ఇదంతా నిజమైనా ఒడిశాలో ఓరియన్ల మనస్సును గెల్చుకోవడం కమలనాథులు చాలా కష్ట పడాల్సి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతు బీజేపీ వైపుకు
గత ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కమలం శ్రేణులు కదన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. 853 జిల్లా పరిషత్ స్థానాలకు 297 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని 17 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఇటు బీజేపీ గానీ, అటు విభేదాలతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీ గానీ సొమ్ము చేసుకోలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీకి గల ప్రజా మద్దతు మాత్రం బీజేపీ వైపు మళ్లిందని ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 474 జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాల్లో 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పట్టు కొనసాగిస్తూనే ఉన్నది.
ఇప్పుడు ఎన్నికలు జరిగినా నవీన్దే పైచేయి
బీజేపీ కేవలం 41 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కలిగి ఉన్నదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ సగానికంటే తక్కువ స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందన్న సంకేతాలేమీ లేవు. సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మాత్రమే విజయం సాధించగలుగుతుందని పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం ప్రభుత్వంలో ఉన్న బీజేడీ.. సంస్థాగతంగా బలహీన పడటం నవీన్ పట్నాయక్ నాయకత్వానికి ఇబ్బందికర పరిణామమే.
బీజేడీ ఓటమికి కారణాలివి..
గమ్మత్తేమిటంటే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో నవీన్ పట్నాయక్ ప్రచారం చేయకపోవడం కూడా బీజేడీ అత్యధిక స్థానాల్లో గెలుపొందలేకపోవడం ఒక కారణం. ఆయన స్థానిక ఎమ్మెల్యేలపైనే పూర్తిగా భారం మోపారు. బీజేపీ తన బలాన్ని కొంత పెంచుకోగలిగిందే తప్ప, పూర్తిగా ఆధిపత్యం సాధించగల స్థాయికి చేరుకోలేదు.
దేశమంతటి ఆదరణే మోదీకి ఓడిశాలోనూ..
పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ.. భవిష్యత్లో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీకి ప్రత్యామ్నాయమని ఊహల్లో సాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి గల ప్రజాదరణ నుంచి ఓడిశా తప్పించుకోలేకపోయిందంటే ఆశ్చర్యమేమీ లేదు. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మానసిక ఒత్తిడి ప్రారంభమైనట్లే తప్ప.. బీజేపీ పై చేయి సాధించే అవకాశాలు మాత్రం తక్కువ.
నవీన్ పట్నాయక్ వ్యూహం ఇలా..
రాజకీయ వ్యూహ రచనలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను అధిగమించగలిగే వారు ఒడిశాలో లేరంటే అతిశేయోక్తి కాదు కానీ ఆయన వ్యూహ రచన దెబ్బ తింటున్నదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు బీజేపీలో రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగల సామర్థ్యం గల నేతలూ తక్కువగానే ఉన్నారు. బీజేపీ ఒడిశా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బసంత్ పాండా, కేంద్ర మంత్రులు జువాల్ ఓరాం, ధర్మేంద్ర ప్రధాన్ మినహా నవీన్ పట్నాయక్ పార్టీతో తలపడే సామర్థ్యం గల నేతలే లేరు.
సరైన వ్యూహం ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న మాట నిజమే గానీ క్షేత్రస్థాయిలో పట్టు మాత్రం కొనసాగిస్తూ ఉన్నది. పార్టీ జాతీయ నాయకత్వం జాగ్రత్త పడి.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించగలిగితే ఈ దఫా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి పూర్వ వైభవాన్ని సాధించగల సామర్థ్యం సంతరించుకోగలిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఒడిశాలోని 21 లోక్ సభా స్థానాల్లో 16 చోట్ల కేవలం 10 వేల ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది.
పొరపాట్లు దిద్దుకుంటున్న నవీన్
అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో 2014 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 25 నుంచి 18 శాతానికి పడిపోయింది. త్రిముఖ పోరుకు తోడు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతోపాటు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని ఆ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దే పనిలో సీఎం నవీన్ పట్నాయక్ పూర్తిగా మునిగిపోయారు. పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ, జిల్లాల వారీ ప్రభుత్వ, పార్టీ ప్రగతి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కేంద్రపాదలో బద్రక్ తరహా అల్లర్లకు యంత్రాంగం చెక్
ఇటీవల కేంద్రపాదలో బద్రక్ తరహా మత కలహాలు చోటు చేసుకునే పరిస్థితులను తిప్పి కొట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా గణనీయంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాల జోరును వచ్చే రెండేళ్ల పాటు కొనసాగించడం కమలనాథులకు పెద్ద సవాల్గా మారింది.
బీజేడీతో పోటీ పడ్తున్న సంఘ్ నెట్ వర్క్
గిరిజనులు అత్యధికంగా జీవిస్తన్న పశ్చిమ జిల్లాల్లో ఆరెస్సెస్, ఇతర హిందు సంస్థలు పట్టు కలిగి ఉండటం సీఎం నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీకి ఇబ్బందికరమే మరి. బీజేడీతో పోలిస్తే ఆరెస్సెస్, ఇతర హిందూ సంస్థలు సమానంగా సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగంపై పూర్తి పట్టు నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి సొంతం. 2014 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాత్రం కేవలం ఒక లోక్ సభ, 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కలిగి ఉన్నారు. సుందర్ గఢ్ జిల్లాలోని జువాల్ ఓరాం అనే గిరిజన నేత కేంద్రంలో మంత్రిగా ఉన్న గిరిజనుల ఆధిపత్యం గల అసెంబ్లీ స్థానాల్లో కొంత పట్టు కలిగి ఉన్నారు.
నవీన్ ఢీ కొట్టే నాయకులెవరు?
ఇక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 71 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే శక్తి సామర్థ్యాలు బీజేపీకి, కమలనాథులకు తక్కువగా ఉన్నాయి. నవీన్ పట్నాయక్ తో సీఎంగా పోటీ పడగల సామర్థ్యం గల నాయకుడు బీజేపీలో లేరు. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదంటే అతిశేయోక్తి కాదు.