తెలంగాణ వర్సెస్ ఎపి: ఎంసెట్ కౌన్సెలింగ్ వార్
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, తాము మాత్రం చేపట్టబోమని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏకపక్షంగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ప్రకటించడాన్ని జగదీష్ రెడ్డి తప్పు పట్టారు. కేసు కోర్టులో ఉండగా ఎలా ప్రక్రియను ప్రారంభిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ స్థితిలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సిలింగ్కు నోటిఫికేషన్ రాబోతోందన్న వార్త వచ్చిన కొద్దిగంటలలోపే నోటిఫికేషన్ రావడం డౌటేనని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను 30న విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. 7నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన చేపడతామని, ఈలోగా ఇరు రాష్ట్రాలూ ఒక నిర్ణయానికి వస్తే వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు వ్యవహారం తేలుస్తామని మండలి అధికారులు చెప్పారు.
మండలి నిర్వహించిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. తాజాగా, మండలి నిర్ణయంతో తమకెలాంటి సంబంధం లేదని తెలంగాణ విద్యా మంత్రి జగదీష్రెడ్డి ప్రకటించటం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అసలు నోటిఫికేషన్ రెండు రాష్ట్రాలకూ చెల్లుబాటు అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల వరకూ కౌన్సిలింగ్ నిర్వహించాలని అనుకున్నా అందుకు వీలుగా ప్రభుత్వ ఉత్తర్వులు లేవని ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు.
మరోపక్క ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్ వేణుగోపాల్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రవేశ పరీక్షల నిర్వహణ, అడ్మిషన్లపై తమకు అన్ని రకాల అధికారాలు ఉన్నాయని తేల్చిచెప్పారు. మండలి ఉభయ రాష్ట్రాలకూ 10 ఏళ్లపాటు సేవలు అందిస్తుందని, మండలి నిర్ణయమే తుది నిర్ణయమని వివరించారు. సుప్రీంకోర్టు 9048/2012 సివిల్ అప్పీల్లో చాలా స్పష్టంగా జూలై 31లోగా అడ్మిషన్లు పూర్తి చేసి, ఆగస్టు 1నాటికి తరగతులు ప్రారంభించాలని ఆదేశించిందని, దాని ప్రకారం చూసుకున్నా ఇంతవరకూ అడ్మిషన్ల ప్రక్రియే ప్రారంభం కాలేదని గుర్తు చేశారు.
2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉన్నత విద్యా మండలి ఉభయ రాష్ట్రాలకూ సేవలు అందించాల్సి ఉంటుందని, అయితే వాస్తవంగా జరుగుతున్న విషయాలపై ఆగస్టు 4కంటే ముందే సుప్రీంకోర్టు కేసులో తాము ఇంప్లీడ్ అవుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు.
ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏటా అడ్మిషన్లకు ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఆ కమిటీకి మండలి చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటున్నారు. అయితే ఆ కమిటీకి మాత్రం కన్వీనర్గా సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడంతో రెండు సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో కమిటీ కన్వీనర్గా ఎవరుండాలనే ప్రశ్న తలెత్తింది.
అది తేలాలంటే ఇరు రాష్ట్రాల సిఎంలు, అధికారులు కూర్చుని అందుకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చి ఉమ్మడి జీవో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అపుడే ఆ జీవో ప్రకారం ముందు ఉన్నత విద్యామండలికి ఉభయ రాష్ట్రాల సమర్థ్ధాకారం వస్తుంది. అలాంటి ఉత్తర్వులు లేకుండా ఉభయ రాష్ట్రాలకు ఉన్నత విద్యామండలి సమర్ధ్ధాకారిగా వ్యవహరించే వీలు లేదు. ఈ సాంకేతిక లోపాన్ని సరిదిద్దనిదే రెండు రాష్ట్రాల్లో కౌనె్సలింగ్ జరిగే అవకాశం లేదని అధికార్లు చెబుతున్నారు.
అక్టోబర్ నెలాఖరుకు గడువు కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లామని, ఆగస్టు 4న కేసు విచారణ ఉందని జగదీష్ రెడ్డి అన్నారు. ఒకవైపు సుప్రీం కోర్టులో కేసు ఉండగా, ఆంధ్ర ప్రభుత్వం ఏకపక్షంగా కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించడాన్ని విమర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజుల కోసం ఆర్థిక సాయం అందించాలని భావిస్తున్నట్టు చెప్పారు.