బిజెపి విస్తరణకు బ్రేక్: కెవిపి బిల్లు వెనక చంద్రబాబు?
హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి విస్తరించకుండా తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ వేసినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగతూ సుజనా చౌదరి, మిత్రపక్ష సభ్యుడైన సిఎం రమేష్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు, ఆ తర్వాత చంద్రబాబు మీడియాలో మాట్లాడిన తీరు అందులో భాగమేనని అంటున్నారు.
రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి చేస్తున్న యత్నాలకు ప్రత్యేక హోదాను అస్త్రంగా ప్రయోగించి బ్రేకులు వేయడం ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అదే సయమంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు వంటి ప్రతిపక్షాలు ఎదగకుండా తాము మిత్రపక్షంగా ఉంటూ కూడా కేంద్రంపై తిరుగులేని పోరాటం చేస్తున్నామనే సంకేతాలను పంపడం కూడా ఆయన వ్యూహంలో భాగమని చెబుతున్నారు.
తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర్ రావు పెట్టిన ప్రైవేట్ సభ్యుడి బిల్లును వాడుకున్నట్లు చెబుతున్నారు. పైగా, ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతున్న మేధావుల ఫోరం వెనకనే కాకుండా కెవిపి బిల్లు ప్రతిపాదన వెనక కూడా చంద్రబాబు ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కేంద్రాన్ని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, మన సహనానికీ హద్దు ఉందని చంద్రబాబు ఇటీవలి పార్టీ సమీక్షా సమావేశంలో చెప్పినట్లు సమాచారం. నిజానికి హోదాపై బిజెపి వైఖరి చంద్రబాబుకు నచ్చడం లేదు. కానీ చాలా కాలంగా మౌనం వహిస్తూ వచ్చారు. బిజెపి రాష్ట్రంలో విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్న సమయంలో తన వ్యూహానికి పదును పెట్టారు.
కెవిపి ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చంద్రబాబు పలుమార్లు సీనియర్లతో భేటీ అయ్యారు. కొందరు వ్యతిరేకించినా కాంగ్రెస్కు మద్దతునివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో ఆ పార్టీ కోలుకోవటం కష్టమని, మనం బిజెపితో నేరుగా యుద్ధం చేయలేని పరిస్థితి ఉన్నందున, రాజకీయంగా ప్రజలకు సానుకూల సంకేతాలు పంపాలంటే కెవిపి బిల్లుకు మద్దతు ప్రకటించడమే సరైన వ్యూహమని బాబు సీనియర్లకు వివరించినట్లు సమాచారం.
చంద్రబాబు తీరుపై బిజెపి తీవ్రమైన అసంతృప్తితో ఉంది మేధావుల ఫోరంతోపాటు, కెవిపి ప్రైవేటు బిల్లు వెనుక బాబు ఉన్నారని, ఆయనే తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని బిజెపి నాయకులు వ్యక్గిగత సంభాషణల్లో అంటున్నారు. తొలుత కెవిపి ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చిన సమయంలో బిజెపికి చెందిన ఓ ప్రముఖుడు ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రభుత్వం మీడియాను సింగపూర్కు తీసుకువెళ్లిన బృందంలో ప్రస్తుతం హోదాపై పోరాడుతున్న నేతను కూడా చేర్చారని, ఢిల్లీలో ఆ బృందం తరచూ చేసే హడావిడి వెనుక, రాష్ట్రంలో చేస్తున్న ఆందోళన వెనక బాబు ఉన్నారంటూ ఆ బిజెపి ప్రముఖుడు తమ నాయకత్వానికి లేఖ కూడా రాశారు. కెవిపి బిల్లు వెనుక ఉన్న వ్యక్తులపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి బహిరంగ విమర్శలే చేారు.
హోదా సెంటిమెంటుగా మారితే పార్టీ నష్టపోతుందని చంద్రబాబు పసిగట్టారు. దీంతో తమ పార్టీని రక్షించుకునేందుకు బిజెపిని ముద్దాయిగా నిలబెట్టే వ్యూహానికి తెర లేపారని అంటున్నారు.