కెసిఆర్, జగన్లకు మోడీ గాలం వేస్తున్నారా?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి రావడానికి దక్షిణాది రాష్ట్రాలే కీలకం కావడంతో కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజన చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా వారిద్దరికి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలం వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతకన్నా ముందే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో దోస్తీ కట్టేందుకు సిద్దపడినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని మోడీ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
ఇక తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు సంబంధించి ఎన్నికల తర్వాత ఆ పార్టీలకు వచ్చే సీట్లను బట్టి పావులు కదిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెసిఆర్ మాట ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో యుపిఎ కాకపోతే ఎన్డీయెతో జత కట్టే ప్రత్యామ్నాయాన్ని కూడా జగన్ సజీవంగా ఉంచుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. తెరాస నేత కె.చంద్రశేఖర రావు, వైకాపా నేత జగన్ మోహన్రెడ్డిలు నరేంద్ర మోడిని పలు సందర్భాల్లో ప్రశంసించారు.
2004, 2009లో వరుసగా రెండు సార్లు యుపిఎ అధికారంలోకి రావటం, ప్రస్తుతం పలు అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ కూరుకుపోవడం వంటి కారణాలు తమకు కలిసి వస్తాయని, మోడీ ఆకర్షణ శక్తి కూడా ఉపయోగపడుతుందని బిజెపి భావిస్తోంది. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉండడం వల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలంగాణకు పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఇస్తామని బిజెపి చెప్పటం, తెలంగాణలో కూడా బిజెపికి కొద్దో గొప్పో క్యాడర్ ఉండడం వల్ల కెసిఆర్ అటు వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఏర్పడకపోయినా ఎన్నికల తర్వాత యుపిఎ, ఎన్డీయేలకు వచ్చే సీట్లు ఆధారంగానే ఇరు పార్టీలు తమ మద్దతు అంశాన్ని ప్రకటిస్తాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి రాష్ట్ర శాఖ విముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ మాత్రం పొత్తుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.