మంగళగిరిలో తాత్కాలిక భవనం.. ఇవీ బాబు సర్కార్ లీలలు?
గత నెల 27న ఏపీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) మంజూరుచేసింది. అదే యూనియన్ ప్రభుత్వం కూడా ఎఫ్ఎస్ఎల్ కోసం రూ.100 కోట్లు కేటాయించడం గమనార్హం.
హైదరాబాద్/ అమరావతి: తెలంగాణ ఏర్పాటుతో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులకు కల్పతరువులు, కామధేనువుల వంటి ప్రాజెక్టులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్య నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'తాత్కాలిక' భవన నిర్మాణాలు ఇంకా ఎంత కాలం? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళగిరి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఏపీ ఎఫ్ఎస్ఎల్)కి తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టడమే ప్రభుత్వం పనితీరును పట్టిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందునా రాజధాని ప్రధాన కేంద్రం వెలగపూడిలో ఎఫ్ఎస్ఎల్ కోసం ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించింది.
కొత్తగా వనరులు కల్పించుకోవాల్సిన రాష్ట్రంలో ఉన్న వనరులు, నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టాల్సిన విద్యుక్త ధర్మం పాలకులదేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అందునా ఇటీవలే కేంద్రం 'ఏపీ ఎఫ్ఎస్ఎల్' నిర్మాణానికి కూడా అనుమతులు మంజూరుచేసింది. అయినా ఇప్పటికీ 'తాత్కాలిక' ఎఫ్ఎస్ఎల్ భవనం నిర్మించి.. తర్వాత మరో చోట మరో ఎఫ్ఎస్ఎల్ భవనం నిర్మించ తలపెట్టడం వెనుక ఏదో రహస్యం.. మతలబు దాగి ఉన్నదా? అని విశ్లేషకులు అంటున్నారు.
ఇలా అమరావతి కేంద్రంగా పాలన
మూడున్నరేళ్ల క్రితం తెలంగాణ విభజన నాడు ‘మమ్మల్ని' కట్టుబట్టలతో వెళ్లగొట్టారని పెడబొబ్బలు పెట్టారు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణ విభజన తర్వాత కూడా ఏడాది పాటు హైదరాబాద్ కేంద్రంగా పాలన సాగించి.. తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు నోటు' కేసులో దొరికిపోయి ఆగమేఘాలపై బెజవాడ చేరుకుని... అక్కడ ఒక గెస్ట్ హౌస్ నుంచి పాలన సాగించారు. అప్పటికప్పుడు శాశ్వత కట్టడాలు లేవు కనుక ఏదో ఒక ఇంటి నుంచి పాలనకు శ్రీకారం చుట్టారని సరిపెట్టుకోవచ్చు. మిగతా రెండేళ్ల వ్యవధిలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణం పూర్తిచేసి, ప్రస్తుతం విజయవాడ - గుంటూరు మధ్య ‘అమరావతి' నగరం కేంద్రంగా అధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ అసెంబ్లీ, సచివాలయంతోపాటు ప్రభుత్వ పాలనకు పలు శాఖలకు అందునా మూడున్నరేళ్లు పూర్తయిన తర్వాత కూడా తాత్కాలిక భవన నిర్మాణం చేపట్టాల్సిన అవసరమేమిటన్న సందేహం వ్యక్తం అవుతున్నది.
మంగళగిరిలో తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ నిర్మాణం ఇలా
రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమరావతికి ఎఫ్ఎస్ఎల్ను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఈ తాత్కాలిక ల్యాబ్ నిర్మాణమెందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్ర రాజదానిగా హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఎల్ పోలీసుల దర్యాప్తులో ఇతోధిక పాత్ర పోషించింది. అది విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉండటంతో ఇంకా పంపిణీ జరగలేదు. ప్రసుతం ఏపీలో ఐదు రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లున్నా హైదరాబాద్లోని మెయిన్ ల్యాబ్నూ అరకొరగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉన్న రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
మూడంతస్తులు పోలీసు శాఖకే
కేంద్ర ప్రభుత్వం అమరావతికి కొత్తగా ఎఫ్ఎస్ఎల్ను కేటాయించిన నేపథ్యంలో ఇటీవల కొత్తగా చంద్రబాబు సర్కార్ చేపట్టిన తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ భవన నిర్మాణం ఎందుకనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం తొలిదశలో రూ.27 కోట్లు కేటాయించింది. మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ సమీపాన తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ కోసం ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. తొలి మూడు అంతస్తులు పోలీస్ శాఖ అవసరాలకు, పైరెండు అంతస్తులు ఎఫ్ఎస్ఎల్ కోసం కేటాయించారు. దానిలో పరికరాలకు, సైంటిఫిక్ స్టాఫ్కు వేతనం (కన్సాలిడేట్ పే) కోసం ఏడాదికి రూ.1.08 కోట్లు, రికరింగ్ బడ్జెట్గా రూ.72 లక్షలు కేటాయించడం గమనార్హం. గత నెల 27వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో అంతర్గత భద్రత పథకానికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
వెలగపూడిలో ఎఫ్ఎస్ఎల్కు మూడెకరాల స్థలం
దానిలో భాగంగానే ఏపీ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ మీడియాకు చెప్పారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు వసతు కల్పన నిమిత్తం కేటాయించిన రూ.100 కోట్ల నుంచి అమరావతి ఎఫ్ఎస్ఎల్కు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఏడాదిలో దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వెలగపూడి సచివాలయం సమీపంలో మూడెకరాల స్థలం కేటాయించింది. కేంద్ర నిధులు మంజూరయ్యాక రాజధానిలో ఎఫ్ఎస్ఎల్ నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మంగళగిరిలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నఎఫ్ఎస్ఎల్ భవనాన్నే శాశ్వత అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.