కిరణ్ 'చిరు' ప్రయత్నం: కొత్త పార్టీలో ఎందరు?
హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన వర్గం ఓ వైపు కొత్త పార్టీ వార్తలను కొట్టి పారేస్తున్నప్పటికీ పుకార్లు మాత్రం తగ్గడం లేదు.
మరోవైపు ఇటీవల సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ పేరుతో ఓ పేరు రిజిస్టర్ అయింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పార్టీ ఏర్పాటైతే కాంగ్రెస్కు చెందిన కనీసం ఎనిమిది మంది ఎంపీలు, యాభై మంది ఎమ్మెల్యేలు అందులో చేరే అవకాశాలున్నాయట.

ఇప్పటికే సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరిట పార్టీ పేరి రిజిస్టరైనందున ఆ పార్టీ పేరుతో ముందుకు సాగాలని కిరణ్కు కొందరు విజ్ఞప్తి చేస్తున్నారట. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశంలోకి వెళ్లేందుకు మొగ్గుచూపని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కిరణ్ ఏర్పాటు చేసే కొత్త పార్టీలో చేరుతారని అంటున్నారు.
కిరణ్ వర్గం కొత్త పార్టీ ఏర్పాటును ఖండిస్తున్నప్పటికీ ఆ దిశలో అడుగులు పడుతున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొత్త పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతల మద్దతు సంపాదించేందుకు కొత్త పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారట.
కేంద్రమంత్రులు పళ్లం రాజు, చిరంజీవిలని కొత్త పార్టీలోకి తెచ్చేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ఇద్దరు నేతలు కొత్త పార్టీలో చేరితే యాభై అసెంబ్లీ సీట్లు, మెజారిటీ లోక్సభ సీట్లు సునాయాసంగా గెలుచుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారట.
వారికి ఉన్న ఇమేజ్, సామాజికవర్గానికి తోడు కిరణ్ 'సమైక్య బలం' తోడైతే కొత్త పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని పలువురు లెక్కలు వేసుకుంటున్నారట. కిరణ్ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర మెజారిటీ ప్రజానీకం మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిజమైన సమైక్యవాదిగా ముద్రపడిన కిరణ్, సొంత పార్టీ పెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే సీమాంధ్ర ప్రజలు తప్పకుండా మద్దతిస్తారని భావిస్తున్నారు.
జగన్, చంద్రబాబులు తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించి ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని, ముఖ్యమంత్రి మాత్రం మొదటి నుండి సమైక్య గళం వినిపిస్తున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు. సమైక్యం కోసం మొదటి నుండి గళమెత్తడం, అధిష్టానాన్ని సైతం ధిక్కరించే ధోరణిలో మాట్లాడటం కిరణ్కు సీమాంధ్రలో ఇమేజ్ పెంచిందంటున్నారు.
మరోవైపు ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ముఖ్యమంత్రి సలహా మేరకే నడుచుకున్నారనే ప్రచారం ఉంది. సీమాంధ్రుల మద్దతు, ఎఫిఎన్జీవోల తోడ్పాటుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ నాయకత్వంలోని పార్టీ అత్యంత సునాయాసంగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారట.












Click it and Unblock the Notifications