Vajpayee memories:భారత "రత్నం"-కార్గిల్ విజేత : అజాత శత్రువు-చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేలా..!!
అటల్ బిహారీ వాజ్పేయి...భారత దేశంకు దొరికిన ఓ అరుదైన రత్నం. అఖండ భారతదేశానికి 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా సేవలందించారు. ఆ సమయంలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అందుకే వాజ్పేయిని అంతా స్మరించుకుంటారు. పేరుకు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ... ఆయన్ను ఇతర పార్టీల వారు కూడా ఎంతో ప్రేమించేవారు. ఆయన ప్రతిభా శైలిని చూసి అబ్బురపడేవారు. వాజ్పేయిలో ఉన్న ఎన్నో లక్షణాలు ఆయన్ను అజాతశతృవుగా నిలిపింది. ఆ లక్షణాల్లో ఒకటి ఆయన వాక్చాతుర్యం. ఆయన మాట్లాడే ప్రతి మాట, ప్రసంగంలో వినిపించే ప్రతి పదం కవితాత్మకంగాను ఆలోచింపచేసే విధంగాను ఉంటుంది. అదే సమయంలో ఫిలాసాఫికల్గా కూడా ఉంటుంది. నేడు అటల్ బిహారీ వాజ్పేయి వర్థంతి. ఈ సందర్భంగా ఆయన చేసిన పలు ప్రసంగాలను ఒకసారి చూద్దాం...
అటల్ బిహారీ వాజ్పేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారు. ఆ స్థాయికి ఎదిగారంటే ప్రజలను తన ప్రసంగాలతో ఆకట్టుకునేవారు. ఇదే తన ఆయుధం అని వాజ్పేయి గురించి తెలిసిన సన్నిహితులు చెబుతుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి 1950లో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. భారతదేశానికి సేవలందించిన అత్యుత్తమమైన ప్రధానుల్లో వాజ్పేయి కూడా ఒకరుగా గుర్తించబడ్డారు. 1996 మే నెలలో భారత దేశ 10వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 13 రోజుల్లోనే అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పదవి కోల్పోయారు. ఇక ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ 161 లోక్సభ స్థానాలు గెలువగా కాంగ్రెస్ 140 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పడిపోయింది. అయితే ఇక్కడ కూడా ఓ చిక్కుముడి పడింది. ఏపార్టీ ఒంటరిగా లేదా ముందస్తు పొత్తుల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. ఈ క్రమంలోనే 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ ఆహ్వానించారు. వాజ్పేయి ప్రధానిగా ప్రమాన స్వీకారం చేశారు.

అయితే వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం సభలో సగం బలాన్ని అంటే 272 మంది ఎంపీల మద్దతును కూడగట్టడంలో విఫలమైంది. అయితే ఆ సమయంలో మోషన్పై ఓటింగ్ వెళ్లాలి అనే అవకాశం ఉన్నప్పటికీ వాజ్పేయి అది వినియోగించుకోలేదు. నేరుగా రాష్ట్రపతి భవన్కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. ఇక్కడే వాజ్పేయి సభలోని ఎంపీలతో పాటు దేశ ప్రజల మనసును గెల్చుకున్నారు. ఆ సమయంలో సభలో వాజ్పేయి చేసిన ప్రసంగం యావత్తు దేశాన్ని ఆకట్టుకుంది. తాను ప్రస్తుతం రాజీనామా చేస్తున్నప్పటికీ... తిరిగి ప్రజల ఆశీస్సులతో అఖండ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పారు.1998లో చెప్పినట్లుగానే వాజ్పేయి అధికారంలోకి వచ్చారు.
ఆ తర్వాత 1999లో కూడా రెండో సారి అధికారం చేపట్టారు. 1996లో బీజేపీ ప్రభుత్వం స్థానంలో వచ్చిన ప్రభుత్వం అస్థిరత్వం, అంతర్గత పోరుతో కూలిపోతుందని ముందుగానే అంచనా వేసిన వాజ్పేయి.. ఆ తర్వాత అదే జరగడంతో అంతా ఆయన ముందుచూపు, ఆలోచనను చూసి ఆశ్చర్యపోయారు. 1996 -1998 మధ్య భారత్లో రెండు సార్లు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రభుత్వాలు వచ్చాయి. అందులో బయట నుంచి మద్దతు ఇవ్వగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోకి వచ్చింది. అప్పుడు దేవేగౌడ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఐకే గుజ్రాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక 1998 మార్చిలో అవిశ్వాస తీర్మానం సమయంలో వాజ్పేయి సభలో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసింది. పార్టీలు, వ్యక్తులు ముఖ్యం కాదని అన్నిటికంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని తాను చేసిన నాటి ప్రసంగం నుంచి నేటి రాజకీయనాయకులకు, ప్రజాప్రతినిధులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. 1977లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని కార్యాలయంలో తొలి ప్రధానిగా దేశానికి సేవలందించిన నెహ్రూ ఫోటో కనిపించలేదు. దీంతో వెంటనే దాన్ని అక్కడ తిరిగి పెట్టేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతూ తనకు నెహ్రూ పై ఉన్న గౌరవాన్ని చాటారు. ఇక కాంగ్రెస్కు కూడా మెత్తగా చురకలంటించారు. బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీగా కాంగ్రెస్ చూస్తోందని ముందు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలని అన్నారు. బీజేపీని రాజకీయాల్లో అంటరాని పార్టీగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేయడం సరికాదన్నారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే బీజేపీ సెక్యులర్ పార్టీగా అవతరించాల్సిన అవసరం ఎంతైతే ఉందో కాంగ్రెస్ కూడా కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం అనే భావన నుంచి బయటకు రావాలని అన్నారు.
ఇక వాజ్పేయిని చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అణ్వాయుధాల దేశంగా గుర్తింపు పొందడంలో నాడు వాజ్పేయి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయమే ఇందుకు కారణం. 1998లో మే 11 మరియు 13వ తేదీల్లో భారత్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు అత్యంత రహస్యంగా నిర్వహించారు. అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏకు కూడా అంతుచిక్కలేదంటే ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతోంది. అంతకుముందు భారత్ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆలోచన చేసింది బీజేపీ-జనసంఘ్. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అణ్వాయుధాలపై వాజ్పేయి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 1999లో సభలో జరిగిన చర్చ సందర్భంగా అణ్వాయుధాలపై వాజ్పేయి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ విమర్శలు సంధించగా ఆ పార్టీకి ధీటైన సమాధానం ఇచ్చారు వాజ్పేయి. ఇందిరాగాంధీ హయాంలో 1974లో పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపినప్పుడు జనసంఘ్ నేతగా తాను మద్దతు తెలిపినట్లు గుర్తుచేశారు. తర్వాత 1998లో జరిగిన పోఖ్రాన్ అణుపరీక్షల గురించి ప్రస్తావిస్తూ భారత్ భద్రతా విషయాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్లాలని చెప్పారు. అదేదో గొప్ప కోసం తాము అణుపరీక్షలు నిర్వహించలేదని.. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే చేశామని వాజ్పేయి చెప్పుకొచ్చారు. శతృ దేశాలు భారత్పైకి చొచ్చుకురాకుండా మన సత్తా ఏంటో వారికి తెలియాలని అన్నారు. ఇక్కడ మరో విషయం కూడా వాజ్పేయి స్పష్టం చేశారు. ముందుగా అణ్వాయుధాలు వినియోగించరాదు.. అదే సమయంలో అణ్వాయుధాలు లేని దేశంపై అణ్వాయుధాలు వినియోగించకూడదని చెప్పి ప్రపంచ దేశాల మన్ననలను పొందాడు. పోఖ్రాన్ అణు పరీక్షల సందర్భంగా నాడు వాజ్పేయి తీసుకున్న నిర్ణయంతో అమెరికా జపాన్ లాంటి దేశాలు భారత్పై ఆర్థిక ఆంక్షలు విధించాయి.
ఆర్థిక ఆంక్షలు విధించగానే .. వాజ్పేయి ఇలా అన్నారు. అణ్వాయుధాలు భారత్ తయారు చేస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసని అదే సమయంలో ఆ కష్టాలనుంచి ఎలా బయటపడాలో భారత్కు తెలుసని చెప్పి మరోసారి శభాష్ అనిపించుకున్నారు. ఆర్థిక ఆంక్షల వల్ల భారత్ అభివృద్ధి ఆగిపోదని మరోసారి గుర్తు చేసిన నేత వాజ్పేయి. ఇతర దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకువచ్చిన సమయంలో... తమ నిర్ణయాల నుంచి ఎప్పుడూ వెనక్కు తగ్గలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక లాలూ ప్రసాద్ యాదవ్ దానా స్కామ్ గురించి లోక్సభలో పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్నారు. బీహార్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. వాజ్పేయి కొన్ని సార్లు పువ్వులా ఎంత సుతిమెత్తగా కనిపిస్తారో కొన్ని సార్లు ఇనుములా అంతే గట్టిగా కనిపిస్తారు. మరో ప్రసంగంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు వాజ్పేయి. బీహార్లో దళితులను కొందరు అగ్రకులాలకు చెందినవారు చంపితే ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అంతేకాదు తప్పులు చేసిన వారికి శిక్ష వేయడంలో న్యాయవ్యవస్థ ఎందుకు జాప్యం చేస్తోందంటూ ప్రశ్నించారు. అయితే తన ప్రసంగాలకు ముందు వాజ్పేయి విషయంపై పరిశోధన చేసేవారని ఆ తర్వాతే తాను ప్రసంగించేవారని సన్నిహితులు చెబుతారు.
ఇలా వాజ్పేయి గురించి చెప్పుకుంటూ వెళితే మరో పుస్తకమే రాయొచ్చు. ఒక వ్యక్తిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక వక్తగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే మనిషి అటల్ బిహారి వాజ్పేయి.
-
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications