భారతదేశంలోనే అత్యధిక పారితోషికం
భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా వార్తల్లోకి వచ్చిన దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఒక భారీ సినిమాలో రావణాసురుడిగా నటించడానికి ఆఫర్ వచ్చింది. వంద కోట్ల రూపాయలతో హిందీలో నిర్మించనున్న ఆ సినిమా దాదాపు భారతీయ భాషలన్నిటిలోకీ డబ్ కానుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్కుమార్ సంతోషి నిర్మించనున్నారు. ప్రముఖ భారతీయ పౌరాణికమైన రామాయణంలో రావణాసురిడి పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పౌరాణికంలో నాయకుడు రాముడికి ప్రతి నాయకుడైన రావణుడిది ధీటైన పాత్ర. గొప్ప శివ భక్తుడైన రావణాసురుడి సుగుణాలు ఆయన భార్య మండోదరికి మాత్రమే బాగా తెలుసు. అటువంటి పాత్రకు రజనీకాంత్ తప్ప మరే భారతీయ నటుడూ న్యాయం చేయలేరని నిర్మాత అభిప్రాయం. ఆయన ఇటీవల చెన్నై వచ్చి రజనీకాంత్కు ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రావణాసురుడి పాత్ర పోషించాలన్న ఆసక్తి రజనీకాంత్కు ఉన్నప్పటికీ, అంగీకారం తెలపడానికి తనకు కొంత సమయం కావాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో రాముడిగా అజయ్ దేవగణ్, సీతగా కాజోల్ నటించనున్నారు.