హోంపేజి
కొందరు విజయవంతమైన వ్యక్తులకు నెంబర్ సెంటిమెంట్లు ఉంటాయి. ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావుకు 9 నెంబర్ అంటే ఎంతో మక్కువ. చిరంజీవికి అటువంటి నెంబర్ సెంటిమెంట్లు లేకపోయినా ఆయన కుటుంబసభ్యులందరికీ దశకం కలిసివస్తోంది. చిరంజీవి నటుడు కావాలని మద్రాసులో అడుగు పెట్టింది 1976లో. ఆయన ప్రయత్నాలు మరో రెండేళ్ళలోనే సఫలమయ్యాయి. మరో పదేళ్ళ తర్వాత ఆయన సోదరుడు నాగబాబు రాక్షసుడు సినిమాలో తొలిసారిగా నటించారు. మరో పదేళ్ళకు 1996లో పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత చిరంజీవి కుమారుడు రామ్చరణ్ 2006 ఆగస్టులో నటుడిగా శ్రీకారం చుట్టనున్నాడు. చిరంజీవికి 2006 సంవత్సరం ఇప్పటికే అనేక శుభాలను తెచ్చిపెట్టింది. ఆయన కుమార్తెవివాహాన్ని ఆయన ఘనంగా జరిపించారు. చిరు అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పద్మ భూషణ్ అవార్డు ఈ సంవ త్సరమే ఆయనను వరించింది.
బెంగుళూరులో వైఎస్ ప్యాంటు బాట
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని చూస్తే మూర్తీభవించిన రైతు బిడ్డలా ఉంటారు. పదహారణాల తెలుగు పంచె, ధోవతి ఆయనను గత ఎన్నికల్లో గ్రామీణులకు చేరువ చేసింది. కానీ ఆయన బెంగుళూరు వెళ్ళినప్పుడల్లా ప్యాంటు షర్టులతో కనిపిస్తారు. ఆయన ఫోటోలను పత్రికల్లో చూసిన బెంగుళూరు వాసులు ఆయనను కొత్త కాస్ట్యూమ్లో పోల్చుకోలేక పోతున్నారు. కుమారుడు జగన్మోహనరెడ్డి బెంగుళూరులో కోరమంగళ ప్రాంతంలో ఉంటారు. ఏ మాత్రం తీరిక దొరికినా వైఎస్ దంపతులు బెంగుళూరు వెళ్ళి కొడుకు, కోడళ్ళతో గడుపుతారు. ఫాదర్స్ డే సందర్భంగా ఇటీవల బెంగుళూరు వెళ్ళిన వైఎస్ కుటుంబసభ్యులతో సహా ప్రముఖ చైనీస్ రెస్టారెంట్ లీలాలో భోజనం చేశారు. అక్కడ వైఎస్ను కొందరు తెలుగు వాళ్ళు తప్ప మిగితా వాళ్ళు గుర్తించలేకపోయారు.
దక్షిణాది సినిమాల్లో తారాజువ్వలా దూసుకెళ్తున్న నయనతార మొండి ఘటం. ఏవరేమి చెప్పినా తాను అనుకున్నది చేయడం ఆమె నైజం. తమిళ హీరో శింబుతో అమె ప్రేమాయణం గురించి తమిళ పత్రికలు ఇప్పటికి కొన్ని వేల పేజీల్లో ప్రచురించి ఉంటాయి. ఎవరేం రాసుకున్నా, కెరీర్ పాడవుతుందని పెద్దలు హెచ్చరించినా నయనతార శింబుతో సందర్శించని పెద్ద హోటళ్ళు లేవు. ఆమె ఈ మధ్య శింబుతో తనకు ఎటువంటి ఎఫైర్ లేదని ఖండించడం వెనుక ఒక యదార్ధ గాధ ఉంది. ఒకరోజు శింబు, నయనతార విహారానికి వెళ్ళవలసి ఉంది. ఆమె ఎంతసేపు ఎదురుచూసినా శింబు రాలేదు. శింబు సెల్ మూగబోయింది. అతను ఎక్కడ ఉన్నాడో అతి కష్టం మీద తెలుసుకుని అక్కడికి వెళ్ళిన నయనతార ఆ దృశ్యాన్ని చూసి షాక్ తింది. శింబు, రీమా కలిసిఉండడం, పైగా వారు అక్కడ నాలుగు గంటలు గడిపారని తెలుసుకోవడంతో నయన హృదయం బద్దలైంది. శింబు కోసం తన కెరీర్ను బలిచేసుకోడానికి సిద్ధపడిన నయనతార ఇప్పుడు పూర్తిగా కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకుంటోంది.