ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దెబ్బ చిక్కులు తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరకూడదనే నిర్ణయం వెనక గాలి బ్రదర్స్ వ్యూహం పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులను సంప్రదించినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరకూడదని, అందుకు తగిన ప్రయోజనం చూపిస్తామని వారు వారికి చెప్పారట. దాంతో ప్రభుత్వంలో చేరాలన్న చిరంజీవి ఉత్సాహంపై నీళ్లు చల్లారు. ఏడుగురు శాసనసభ్యులకు మహేశ్వర్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారట. సోమవారం ప్రజారాజ్యం శాసనసభా పక్షం సమావేశానికి మహేశ్వర రెడ్డి హాజరు కావడమే గాలి బ్రదర్స్ వ్యూహాన్ని అమలు చేయడానికని వినికిడి. ప్రభుత్వంలో చేరితే తాము చీలిపోతామని ఆ ఏడుగురు శాసనసభ్యులు చిరంజీవిని బెదిరించారని సమాచారం. దీంతో చిరంజీవి నిర్ణయం మారిపోయిందని చెబుతున్నారు.