దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుకు కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెవిపి రామచందర్ రావును పూర్తిగా దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. వైయస్సార్ ప్రభుత్వంలోనే కాదు, రోశయ్య ప్రభుత్వంలోనూ కెవిపి చక్రం తిప్పుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు దానికి బ్రేకులు పడే అవకాశం ఉంది. కెవిపి రామచందర్ రావు కిరణ్ కుమార్ తో వ్యక్తిగతంగా మాట్లాడడానికి ప్రయత్నించారట. తనకు సమయం లేదని చెప్పి కెవిపిని కలవడానికి ఆయన నిరాకరించారని సమాచారం. తనతో కలవడానికి ప్రయత్నించవద్దని కూడా సూచన చేసినట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వంపై గానీ తన వ్యవహార శైలిపై గానీ కెవిపి ముద్ర పడకూడదనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న కెవిపిపై ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా తీవ్ర విమర్సలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెవిపితో సాన్నిహిత్యాన్ని గానీ కిరణ్ కుమార్ కోరుకోవడం లేదని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా, కెవిపి రామచందర్ రావు పదవికి కూడా ఎసరు రావచ్చునని అంటున్నారు.