యాంకర్ ను బెదిరించిన సుబ్బిరామిరెడ్డి
టీవీ9కు మరో షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి అంతకు ముందే ఓ షాక్ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించడానికి కాకుండా ఇద్దరు వ్యక్తులను చర్చకు పిలిచి వివాదాన్ని మరింతగా రెచ్చగొట్టడమే టీవీ9 పనిగా పెట్టుకుంది. దానికి అది మూల్యం చెల్లించినట్లే భావించాలి. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను కూలుస్తామని తెరాస నాయకుడు కెటి రామారావు చేసిన ప్రకటనపై చర్చ నిర్వహించింది. దానికి నాయని నర్సింహారెడ్డిని, ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్ ను ఆహ్వానించింది. మీరెప్పుడు విగ్రహాలను కూలగొడతారని టీవీ9 ప్రతినిధి అడగడంతో నాయని నర్సింహారెడ్డి భగ్గుమన్నారు. శత్రుత్వాన్ని పెంచడానికి ఆంధ్రకు చెందినవారు అర్థం లేని ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారని నాయని నర్సింహారెడ్డి ఒంటికాలి మీద లేచారు. వివాదాలను రచ్చ చేయడం టీవీ చానెళ్లు చేయడం రాజకీయ నాయకులకు అసహనాన్ని తెప్పిస్తోందని అనడానికి ఇది మంచి ఉదాహరణ.