ఇంకా చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షుడేనా?
రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత చిరంజీవి ఇంకా తాను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షునే్ననని అనుకోరాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం కాంగ్రెస్ కార్యకర్తల్లో లేదని, వారిలో నైరాశ్యం వచ్చిందని, ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్కు రక్తం ఇచ్చినా ఎక్కించుకోవడం లేదని చిరంజీవి వ్యాఖ్యానించడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
చిరంజీవి ఇంకా తాను పిఆర్పి అధ్యక్షునిగా భావించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. చిరంజీవి అంటే తమకు గౌరవం ఉందని, చిరంజీవిని తాను ప్రశ్నించడం లేదని పాలడుగు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక గెలుపు-ఓటములు చూసిందని అన్నారు. నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో తమ వల్లే కాంగ్రెస్ గెలుపొందిందని చిరంజీవి వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ను చిరంజీవి విమర్శించరాదని, చిరంజీవినీ కాంగ్రెస్ నాయకులు విమర్శించరాదని ఆయన కోరారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం ప్రజావిజయంగా అభివర్ణించారు. కాంగ్రెసు విజయానికి ప్రజలు ఎంతో మంది సహకరించారని, ఆ ప్రజల్లో చిరంజీవి ఒక్కరని ఆయన వ్యాఖ్యానించారు.